Jada Sravan Kumar: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల డీఎస్సీ పై పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతోంది. డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయి అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ. వైసిపి వేసిన పిటిషన్లు న్యాయస్థానాలు కొట్టి వేస్తున్నాయి. కానీ ఆ పార్టీ వారు ఆందోళనలు మాత్రం ఆపడం లేదు. డీఎస్సీ 2025 పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ అంశం ప్రజల్లోకి వెళ్లడం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అబాసుపాలు అవుతోందని జై భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ చెబుతుండడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలలో వైసీపీతో కలిసి పనిచేశారు శ్రవణ్ కుమార్. కానీ డీఎస్సీ 2025 విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తోంది అనేది జడ శ్రావణ్ కుమార్ వాదన.
* హైకోర్టులో విచారణ చేయకుండానే..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ద్వారం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కోరారు. కానీ ఒక్కటంటే ఒక్క సాహేతుకమైన ఆధారం చూపలేకపోయారు. దీంతో విచారణ జరపకుండానే హైకోర్టు దానిని కొట్టివేసింది. అయినా సరే అక్రమాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే ఉంది. దానిని తప్పుపడుతున్నారు జడ శ్రావణ్ కుమార్. తప్పు జరిగితే ఆధారాలు చూపించాలి కానీ అర్థంలేని అనుమానాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది వేలాది మంది ఉద్యోగాలతో కూడిన అంశమని.. బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొస్తున్నారు. పైగా ఏడాదిన్నర కిందట జరిగిన డీఎస్సీ పరీక్షల గురించి ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం ఏమిటనేది జడ శ్రావణ్ కుమార్ ప్రశ్న. పైగా తప్పులు ఉంటే వాటిని పట్టుకొని ఆధారాలను సమర్పించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేని పోనీ అంశాలతో ప్రజల్లో అబాసుపాలు అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
* ఎప్పటికప్పుడు నివృత్తి..
డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు.. సాక్షి మీడియాలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. ప్రతి అనుమానాన్ని నివృత్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని సాక్షిలో రాసుకోచ్చారు. దానికి కూడా వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు కేటాయించారో కూడా ప్రకటించారు. అయినా అదే పనిగా వైసిపి ప్రచారం చేస్తుండడం, ఆధారాలు లేకుండా కోర్టుకు వెళుతుండడం, ఏడాదిన్నర కిందట జరిగిన డీఎస్సీ పై ఇప్పుడు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తుండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు శ్రవణ్ కుమార్. వైసిపి చేస్తున్న ఆందోళనలు కంటే.. ఆ అంశాన్ని పట్టుకొని పోరాడుతున్న వైసిపి జనాల్లో పలుచన అవుతుందని ఆందోళనతో ఉన్నారు. ఇక తేల్చుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.