YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. తనకు ఏపీలో భద్రత లేదని.. కేంద్రం భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై అమిత్ షాను కలిసినట్లు ఢిల్లీలో వైసిపి వ్యవహారాలు చూస్తున్న వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఏపీ ప్రభుత్వం పోలీస్ బందోబస్తును తగ్గించిందని.. ఆయనకు భద్రత లేకుండా పోతోందని.. ప్రాణ హాని ఉందంటూ వైవి సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల పర్యటనల్లో జరిగిన భద్రత వైఫల్యాలను సైతం అమిత్ షాకు వివరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే గతంలో సైతం టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది జగన్ పై. ఆ సమయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ పై అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర భద్రతా వ్యవస్థను కావాలని కోరారు. ఇప్పుడు కూడా అటువంటి డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.
* దేశ అంతర్గత భద్రత..
దేశ అంతర్గత భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చూస్తుంది. ప్రస్తుతానికి కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ఉన్నారు. అందుకే ఆయన దృష్టికి తీసుకెళ్లారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే కేంద్ర భద్రత ఆశిస్తున్నారా అంటే అది లేదు. కేంద్ర బలగాలు వచ్చి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తే ఈ స్థాయిలో ఆయన ప్రజల్లోకి వెళ్ళగలరా? కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఓవరాక్షన్.. ఆపై ఆ పార్టీ జన సమీకరణ.. డిజిటల్ మీడియా హైప్ కోసం చేసే ప్రయత్నాలు.. కచ్చితంగా కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా వైసిపి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిందంటే.. కేవలం పొలిటికల్ ఇమేజ్ కోసమే.
* అడిగితే అణచివేత..
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పోలీస్ శాఖకు నివేదించాలి. పర్యటనలకు అనుమతులు తీసుకోవాలి. ఆ సమయంలో పోలీస్ శాఖ కొన్ని రకాల నిబంధనలు పెడుతుంది. కాన్వాయ్ విషయంలో సైతం స్పష్టమైన వివరాలు అందించాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమతులు తీసుకుంటుంది. నిబంధనలు పాటించడం లేదు. పోలీస్ శాఖ నుంచి అభ్యంతరాలు వస్తే తమ గొంతు నొక్కుతున్నారు అంటూ వక్ర భాష్యం చెబుతున్నారు. మొన్ననే పొగాకు రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఏ స్థాయిలో బీభత్సం సృష్టించారు తెలియనిది కాదు. జనాలకు ఇబ్బంది పెట్టి ఏ స్థాయి తెచ్చుకున్నారో తెలియనిది కాదు. అయినా పదే పదే అదే తప్పు చేసి.. పోలీస్ శాఖ భద్రత వైఫల్యం అంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాల భద్రత కావాలని కోరుతున్నారు. అది జరిగే పని కాదు.. కానీ రాజకీయాల్లో అది భాగమే.