గత లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు సుదీర్ఘ కాలం మూతపడ్డాయి. మార్చిలో మూతపడ్డ థియేటర్లు ఈ ఏడాది జనవరిలోగానీ పూర్తిగా తెరుచుకోలేదు. ఈ గ్యాప్ లో పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అప్పులు పెరిగిపోతున్నాయనే సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి.
అందులో కొన్ని హిట్టయ్యాయి. కొన్ని ఫట్టయ్యాయి. అయితే.. ‘వి’ వంటి పెద్ద సినిమా డిజాస్టర్ గా మిగలడంతో.. సదరు సంస్థకు చాలా నష్టం వాటిల్లింది. దీంతో.. పెద్ద చిత్రాలను కొనుక్కుంటే.. చేతులు కాలడానికి ఎక్కువ అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చాయి ఓటీటీ సంస్థలు.
ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ ఛాయలు కనిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ‘మినీ లాక్ డౌన్’ అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ ప్రకటించాయి. థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. దీంతో.. ఇప్పటికే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలతో ఓటీటీ సంస్థలు బేరసారాలు ఆడుతున్నాయి.
అయితే.. ఆ సంస్థల లిస్టులో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ బడ్జెట్ మూవీసే ఉండడం గమనించాల్సిన అంశం. గల్లీ రౌడీ, పాగల్, ఆకాశవాణి, గుడ్ లక్ సఖీ వంటి చిత్రాల మేకర్స్ తో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కాగా.. ఈ సారి కూడా పెద్ద సినిమాలను కొనుక్కునేందుకు ఆసక్తి చూపించట్లేదు. వాటిని కొనుక్కొని.. అనవసరంగా రిస్క్ ఫేస్ చేయడం ఎందుకని ఆలోచిస్తున్నాయట. ఒకవేళ తీసుకున్నా.. పే ఫర్ వ్యూస్ పద్ధతిని ఫాలో కావాలని చూస్తున్నాయట. అయితే.. పెద్ద చిత్రాల నిర్మాతలు కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. మరో రెండు మూడు నెలల్లో సాధారణ పరిస్థితులు రావొచ్చనే అంచనాలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది.
పైగా.. పెద్ద హీరోలు ఓటీటీలో సినిమా ఆడించడానికి అంగీకరించకపోవచ్చు. దీంతో.. మరోసారి చిన్న సినిమాలే ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరి, ప్రదర్శన ఎప్పటి నుంచి మొదలవుతుందో? మొదటి సినిమా ఏది అవుతుందో చూడాలి.