Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు జనంపై విరుచుకుపడుతున్నారు. భారీగా జనాలు వస్తున్నారు. ఆయన ఎటువంటి పరామర్శకు వచ్చినా.. సమస్యలను తెలుసుకోవాలని వస్తున్నా.. జనం మాత్రం తండోప తండాలుగా వస్తున్నారు. అయితే జన సమీకరణ చేస్తున్నారు. అంతకుమించి డబ్బులు ఇచ్చి సమీకరిస్తున్నారు అన్న విమర్శ ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే అలా చేస్తున్న జన సమీకరణతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది. తాజాగా పొగాకు రైతుల పరామర్శకు వెళ్లారు జగన్. ఇప్పుడు కూడా భారీ బల ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో పొగాకు రైతులకు ఏం న్యాయం జరిగిందో తెలియదు కానీ.. పొగాకు బేళ్లను ధ్వంసం చేసి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చారు. మహిళలు నడుపుతున్న టిఫిన్ షాపులను ధ్వంసం చేశారు. ఈ రెండు అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి.
* కొత్త కొత్త సమస్యలు..
జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ఉన్న సమస్యలను కాదని కొత్త సమస్యలు పెరుగుతున్నాయి. మొన్ననే మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భారీ బల ప్రదర్శనకు దిగారు. ఓ ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని తప్పించి మరొకరిని ఇరికించారు అప్పలరాజు. పైగా తన కుమారుడు కారణంగా ఒక మనిషి చనిపోయారు. ఆ పేద కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి తన కుమారుడి స్థానంలో మరొకరిని కేసులో పెట్టించి తప్పు దోవ పట్టించారు. అటువంటి వ్యక్తిని బలప్రదర్శనగా పరామర్శించేందుకు జగన్ బయలుదేరారు. కానీ ఈ బందోబస్తు నిర్వహణలో ఉన్న ఓ మహిళ ఎస్సై పట్ల వైసీపీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించాయి. ప్రస్తుతం వైసీపీ నేతలు ఆ కేసులో చిక్కుకున్నారు.
* లేనిపోని వివాదాలు..
అనవసరంగా బలప్రదర్శనకు దిగుతూ లేనిపోని వివాదాల చుట్టూ వైసీపీ శ్రేణులు చిక్కుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిన్న పొగాకు రైతుల పర్యటనకు సంబంధించి వెళుతుండగా చొక్కాలు చించి మరి.. డాన్సులు వేస్తూ వైసీపీ శ్రేణులు హంగామా చేశాయి. అయితే ఈ బల ప్రదర్శన వెనుక పార్టీ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. కానీ అది అంతిమంగా పార్టీకి డ్యామేజ్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇది ధైర్యం నింపే అంశం కావచ్చు. వారిలో ఒక రకమైన ఊపు తేవాలని భావించవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల తటస్తులు, విద్యాధికులు మాత్రం దూరమవుతున్నారు. ఇక తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.