YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై ఉద్యమం చేపడుతోంది. అయితే ఈ ఉద్యమం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుందో తెలియడం లేదు కానీ.. ప్రజల్లోకి ఈ అంశం వెళ్లడం లేదు. పైగా కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. సమాజంలో అస్థిరతను, గందరగోళాన్ని సృష్టించేందుకే డీఎస్సీ పై విష ప్రచారం చేస్తున్నారు అంటూ కొంతమంది మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సైతం ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టారు. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ సైతం దీనిని తీవ్రంగా తప్పుపడుతోంది. వేలాదిమంది ఉపాధ్యాయుల్లో అశాంతి నింపడమే అవుతుందని తేల్చి చెబుతోంది. ప్రజా సమస్యలు గాలికి వదిలి డీఎస్సీ 2025 పై విషం చిమ్మడంపై తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తోంది. కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఇంత జరిగాక కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
* చింతా మోహన్ ఆగ్రహం..
సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ పై ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వేలాది మంది ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ పై ఆత్మగౌరవం పేరుతో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాయలసీమ వాసిగా.. బాధ్యతాయుతమైన కేంద్ర మాజీ మంత్రిగా స్పందించారు చింతా మోహన్. అసలు డీఎస్సీ పై ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఒక్క అక్రమం కూడా జరగలేదని తనకు తెలుసు అని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసినప్పుడు తాను దీనిపై లోతైన శోధన చేశానన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల్లో అయోమయం సృష్టిస్తామంటే కుదిరే పని కాదని తేల్చి చెప్పారు.
* ఒక్కోవర్గం దూరం..
అయితే ఒక్క మాట మాత్రం నిజం. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను దూరం చేసుకుంటుంది. ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాన్ని దూరం చేసుకుంది. ఇంకోవైపు తనతో కలిసివచ్చే రాజకీయ పక్షాలు లేకుండా చేసుకుంటుంది. చింతా మోహన్ కేంద్ర మాజీ మంత్రి హోదాలో.. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు హోదాలో మాట్లాడుతారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి డీఎస్సీలో అక్రమాలు జరగలేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పోరాటాన్ని తప్పుపట్టారు. అయితే చింతా మోహన్ మాదిరిగా మరి కొంతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల జీవితాలకు సంబంధించిన అంశం కావడంతో మిగతా రాజకీయ పక్షాలు వారికి అండగా నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే నలుగురికి నచ్చేది తనకు నచ్చదు అన్న స్వభావం జగన్మోహన్ రెడ్డి ది. కచ్చితంగా డీఎస్సీ 2025 పై వైసిపి ఒకవైపు.. మిగతా రాజకీయ పక్షాలు మరోవైపు నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది. అచ్చం అమరావతి మాదిరిగా వైసీపీ ఒంటరి కావడం ఖాయం.
View this post on Instagram