Perni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డిఫెన్స్ లో పడింది. డీఎస్సీ 2025లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రధాన చర్చగా మారింది. శాసనసభకు 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరై డీఎస్సీ 2025 పై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే శాసనసభలో మంత్రి నారా లోకేష్ పదేపదే సవాల్ చేశారు. గతంలోనూ జగన్మోహన్ రెడ్డికి చేశానని.. ఇప్పుడు కూడా నాలుగోసారి సవాల్ చేస్తున్నానని గుర్తు చేస్తూ మరి విమర్శలు చేశారు లోకేష్. పక్కనే ఉన్న మండలికి వచ్చి.. శాసనసభకు జగన్ రాకపోవడం ఏంటని.. ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే సభకు వచ్చి తనను ప్రశ్నించాలి అంటూ సవాల్ చేశారు లోకేష్.
* అనుమానమే తప్ప ఆధారం ఏది?
రాజకీయ పార్టీగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025లో అవకతవకలు జరిగాయని భావిస్తూ.. పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అనుమానం అనే అజెండాను తీసుకుని ముందుకు వెళ్తోంది. ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం చూపలేకపోతోంది. పోనీ సాక్షి మీడియా ద్వారా.. లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే జర్నలిస్టుల ద్వారా.. ఈ అంశంపై శోధన చేసి ఉంటే కొంత ఫలితం దక్కేది. ఆ పని చేయకపోగా కోర్టుల మెట్లు ఎక్కి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకుంటుంది. కచ్చితంగా డీఎస్సీలో తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టుకునే అవకాశం ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అనుమానాలు చుట్టూ మాత్రమే తిరుగుతోంది. ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 ఉద్యమం విషయంలో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు.
* ప్రజల్లోకి లోకేష్ ప్రకటన..
అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా లోకేష్ చేసిన ప్రకటన ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. నేను ఇప్పటివరకు మూడుసార్లు సవాల్ చేసి పిలిచానని.. ఇప్పుడు నాలుగో సారి సవాల్ చేస్తున్నానని చెబుతూ లోకేష్ చేసిన ప్రకటన ప్రజల్లోకి వెళుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పోనీ లోకేష్ చేసిన సవాల్ కు జగన్మోహన్ రెడ్డి కాకపోయినా.. మిగతా 11 మంది ఎమ్మెల్యేలైన స్వీకరించి ఉంటే బాగుండేది. కానీ అసలు చట్టసభల్లో సభ్యుడు కానీ పేర్ని నాని చర్చకు సిద్ధం అంటూ.. ఆ సవాల్ ను స్వీకరిస్తున్నాను అంటూ చెబుతూ తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను అసమర్థులుగా తేల్చేశారు. రాజకీయ విమర్శలకు, ప్రత్యర్ధులపై ఎదురుదాడికి పేర్ని నాని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆ పార్టీ భావజాలాన్ని గట్టిగానే చెబుతారు. కానీ ఇప్పుడు లోకేష్ సవాల్ చేసింది జగన్మోహన్ రెడ్డిని. పోనీ ఆయన రాకపోతే ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరినైనా పంపించేందుకు.. కనీసం మాట్లాడించిన బాగుండేది. ఎంతవరకు మండలిలో తమకు బలం ఉంది. చైర్మన్ తమ వాడే కావడంతో మాట చెల్లుబాటు అవుతుంది అన్న కోణంలోనే ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అనుమానాలు చుట్టూ ఆధారాలు చూపకుండా డీఎస్సీ పై ఆరోపణలు చేస్తుండటమే ఒక తప్పు అయితే.. రండి చర్చిద్దాం అని అధికారపక్షం సవాల్ విసురుతున్న పట్టించుకునే పరిస్థితిలో జగన్ లేరు.