EV sales India : భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కాలుష్య నియంత్రణ, ఇంధన ఖర్చుల తగ్గింపు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి కారణాలతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2018లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా కేవలం 0.5 శాతం మాత్రమే ఉండగా.. 2025-26 నాటికి అది 8.25 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశ రహదారులపై 87 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ఈ వృద్ధి అన్ని విభాగాల్లో ఒకేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల కొనుగోలుదారులు మాత్రం ఈవీల వైపు మారేందుకు ఇంకా కొంత సందేహిస్తున్నారు.
ఈవీ వినియోగంలో ముందున్న రాష్ట్రాలేవి?
NITI Aayog, WRI India కలిసి రూపొందించిన India Electric Mobility Index (IEMI) 2025 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ పురోగతిని అంచనా వేసింది. రవాణా విద్యుదీకరణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, ఈవీ పరిశోధన–ఆవిష్కరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మొత్తం సూచీలో 84 స్కోర్తో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర 78, కర్ణాటక 73, చండీగఢ్ 71, గోవా 65 స్కోర్ సాధించాయి. అయితే మొత్తం సూచీలో మెరుగైన స్థానం ఉన్న రాష్ట్రాల్లోనే ప్రైవేట్ ఈవీ కొనుగోళ్లు అత్యధికంగా ఉన్నాయని చెప్పలేం.
ప్రైవేట్ కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి?
ప్రైవేట్ ఈవీ అడాప్షన్ను పరిశీలిస్తే మరో ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తోంది. కేరళ, గోవా 12 శాతంతో ముందంజలో ఉన్నాయి. కర్ణాటక 11 శాతం, ఒడిశా 9 శాతం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైవేట్ ఈవీల వాటా 8 శాతంగా ఉంది.ఇక్కడ ప్రైవేట్ ఈవీ అడాప్షన్ అంటే నమోదైన ప్రైవేట్ ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను సూచిస్తుంది.మరోవైపు వాణిజ్య వాహనాల్లో ఈవీల వినియోగం మరింత ఎక్కువగా ఉంది. త్రిపురలో కమర్షియల్ ఈవీ అడాప్షన్ ఏకంగా 61 శాతానికి చేరింది. ప్రభుత్వ మద్దతుతో నడిచే ఎలక్ట్రిక్ బస్సులు, ఫ్లీట్ వాహనాలు వంటి వాటి కారణంగా వాణిజ్య విభాగంలో ఈవీ వినియోగం వేగంగా పెరుగుతోంది.
ఛార్జింగ్ స్టేషన్లు కీలకమేనా?
ప్రైవేట్ వినియోగదారులు ఈవీ కొనుగోలు విషయంలో వెనుకడుగు వేయడానికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత కూడా ఒక అంశంగా కనిపిస్తోంది. IEMI గణాంకాల ప్రకారం లక్ష నమోదిత వాహనాలకు ఢిల్లీలో 41.1 పబ్లిక్ ఛార్జర్లు ఉన్నాయి. కర్ణాటకలో ఈ సంఖ్య 36.8గా ఉంది. మరోవైపు అండమాన్–నికోబార్ దీవుల్లో ఇది కేవలం 3.2గా ఉంది.అంటే రాష్ట్రాల మధ్య ఛార్జింగ్ మౌలిక సదుపాయాల్లో భారీ వ్యత్యాసం ఉంది. దూర ప్రయాణాలు చేసే ప్రైవేట్ వాహనదారులకు ఛార్జింగ్ సౌకర్యాల లభ్యత ముఖ్యమైన అంశంగా మారుతోంది.
పెరుగుతున్న ఈవీ స్టార్టప్ ఎకోసిస్టమ్
ఎలక్ట్రిక్ మొబిలిటీ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో స్టార్టప్లు, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు కూడా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిమాణంతో పోల్చిన ఈవీ స్టార్టప్ల సంఖ్యలో ఢిల్లీ ప్రతి రూ.1 లక్ష కోట్ల GSDPకు 30 స్టార్టప్లతో ముందుంది. హర్యానా 24 స్టార్టప్లతో తర్వాతి స్థానంలో ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో ఈ సంఖ్య 19గా ఉంది.
మొత్తంగా చూస్తే భారత్లో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. ప్రైవేట్ కొనుగోలుదారుల స్థాయిలో పూర్తి స్థాయి మార్పు ఇంకా జరగాల్సి ఉంది. వాహనం ధర, బ్యాటరీపై నమ్మకం, ఛార్జింగ్ సదుపాయాలు, ప్రయాణ పరిధి వంటి అంశాలు ప్రైవేట్ కొనుగోలుదారుల నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఈవీ విక్రయాల వృద్ధితో పాటు ఛార్జింగ్ నెట్వర్క్, సాంకేతికత, వినియోగదారుల విశ్వాసం కూడా ఎంత వేగంగా పెరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.