Ayyannapatrudu Chintakayala: మెగా డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది ఆ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుపుతోంది. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో వివరణ ఇప్పిస్తానని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ఆయనతో పూర్తిగా వివరణ ఇప్పించి.. సంతృప్తి చెందకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా అసెంబ్లీకి హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కోరారు. సభకు వస్తే దీనిపై పూర్తిగా అనుమానాలను నివృత్తి చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు.
* అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెగా డీఎస్సీ 2025లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది. కోర్టులో పిటిషన్లు వేస్తోంది కానీ ఆధారాలు చూపించలేకపోతోంది. కేవలం అనుమానాలు మాత్రమే హైలైట్ చేస్తూ రోజువారి ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. అయితే వైసిపి ఎమ్మెల్యేలతో పాటు జగన్ మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సభకు వస్తే కచ్చితంగా దీనిపై చర్చిద్దామని.. ప్రత్యేక సమయం ఇచ్చి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో వివరణ ఇప్పించే ప్రయత్నం మాత్రమే కాదు హామీ ఇస్తున్నానని.. సభకు హాజరు కావాలని అయ్యన్నపాత్రుడు వారిని కోరారు.
* తగినంత సమయం కేటాయింపు..
పలువురు డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు అయ్యన్నపాత్రుడు కలిశారు. ఈ సందర్భంలోనే అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరగలేదని తేల్చేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేశారు. తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని.. గతంలో మాదిరిగా అయ్యన్నపాత్రుడు అయి ఉంటే.. అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ సర్దుకొని జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక సూచన చేశారు. సభకు వస్తే తగినంత సమయం కేటాయించి డీఎస్సీ 2025 పై చర్చిద్దామని కూడా ఆఫర్ ఇచ్చారు. మరి జగన్ మోహన్ రెడ్డి ఈ ఆఫర్ ను సమ్మతిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది చూడాలి.
View this post on Instagram