Botsa Satyanarayana: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా శాసనమండలిలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఉంది పరిస్థితి. ప్రారంభం నుంచి డీఎస్సీ 2025 పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బొత్స డీఎస్సీ 2025 పై ఆరోపణలు చేశారు. ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటూ ఆరోపించారు. దీనిపై మంత్రి అచ్చెనాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంతో పారదర్శకంగా డీఎస్సీ 2025 చేపట్టినట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ఐదేళ్లపాటు ఉంటూ ఒక్క డీఎస్సీ అయినా ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు. పైగా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహిస్తే దానిపై కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్లపాటు గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒప్పించలేని దద్దమ్మ బొత్స అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నేత ఇప్పుడు డీఎస్సీ 2025 పై దుష్ప్రచారం చేయడం తగదు అంటూ హితవు పలికారు.
* ఘాటుగా రిప్లై..
అయితే దీనిపై బొత్స అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దద్దమ్మ అనడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దులా పెరగడం కాదు అని.. భాష బాగుండాలి అంటూ హితవు పలికారు. ఎవరు ఎద్దులా పెరిగారో.. ఎవరు దద్దమ్మో ఏపీ ప్రజలకు తెలుసు అన్నారు. రైతులకు ఎరువులు ఇవ్వలేని అసమర్థతను దేనితో పోల్చాలి అంటూ ప్రశ్నించారు. తక్షణం మండలి రికార్డుల్లో ఆ పదప్రయోగాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025 విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి అయితే తనను దద్దమ్మ అనడంపై బొత్స తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు తగదు అంటూనే ఎద్దు అంటూ సంభోదించారు బొత్స.
* ఎండగట్టిన అచ్చన్న..
అయితే తాను ఎప్పుడూ అన్ పార్లమెంటరీ పదాలు వాడనని మంత్రి కింజరాపు అచ్చెనాయుడు అన్నారు. తమ హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ అయినా భర్తీ చేశారా అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ 2025 పై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ భర్తీ చేసిన కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేసే కుట్రగా అభివర్ణించారు. ఇలానే వ్యవహరిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు మండలి లో ఈ స్థాయిలో వాదోపవాదాలు జరగడం సెగలు పుట్టిస్తోంది. ఇంకా నాలుగు రోజుల వ్యవధి ఉంది. మరి ఇటువంటి ఘటనలు ఎన్ని చూడాలో మరి. మరోవైపు వైసీపీ సంఖ్యా బలం ఎక్కువ కాబట్టి మండలిలో స్వరం వినిపించాలని చూస్తోంది. ఈ క్రమంలో అధికార కూటమి నుంచి గట్టిగానే ప్రతిఘటన ఉంది.
View this post on Instagram