Andhra Pradesh MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు సభ్యులు ఈనెల 28న పదవి విరమణ చేస్తారు. దీంతో కూటమికి చెందిన ఇద్దరు నేతలకు ఛాన్స్ దక్కనుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చాలామంది సీనియర్ నేతలు సైతం పోటీలో ఉన్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్రకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ అవకాసం ఇస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో పదిమందికి పైగా ఆశావహులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
* విశాఖలో మాజీ మంత్రి..
ఉత్తరాంధ్ర అంటేనే ఎక్కువగా బీసీలు గుర్తుకొస్తారు. అందుకే ఆ రెండు ఎమ్మెల్సీలు ఒక పదవి ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతకు ఇస్తారని తెలుస్తోంది. విశాఖ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. గతంలో ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయలేదని చెప్పి 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ దాదాపు పుష్కర కాలం ఉన్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తిరిగి మాతృ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ తోనే ఆయన చేరినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. దీంతో ఈసారి ఆయనకు చాన్స్ ఉండబోతుందన్న ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సైతం మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. దక్కలేదు కానీ కూటమి తరుపున బాగానే పనిచేశారు. పైగా బీసీ నేత కావడంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారని విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది.
* నెల్లిమర్ల నేత సైతం..
విజయనగరం జిల్లాకు సంబంధించిన నెల్లిమర్ల టిడిపి ఇన్చార్జ్ కర్రోతు బంగార్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నారు. కానీ చట్టసభలకు వెళ్లాలన్నది ఆయన కోరిక. మొన్నటి ఎన్నికల్లో భోగాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు ఆయన. అయితే కూటమి వచ్చిన తర్వాత ఆయనకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆయన మాత్రం ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నారు. నెల్లిమర్ల అనేది కీలక నియోజకవర్గం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మితం అవుతుండడంతో ఆ నియోజకవర్గాన్ని టిడిపి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే అశోక్గజపతిరాజు కుమార్తె భోగాపురం నుండి పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉంది. అయితే బంగారు రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే అక్కడ అదితి గజపతిరాజు ఈజీగా గెలుస్తారన్న ఈక్వేషన్ ఉంది.
* సిక్కోలు నుంచి..
శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కలమట వెంకటరమణ ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పాతపట్నం టికెట్ త్యాగం చేశారు. కొత్త నేత మామిడి గోవిందరావుకు టికెట్ లభించగా.. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. అందుకే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇలా ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ పదవుల కోసం గట్టి పోటీ ఉంది. చూడాలి ఎవరికి అవకాశం దొరుకుతుందో..
