Mudragada Vs Coalition Government: ముద్రగడ పద్మనాభానికి( mudragada Padmanabham ) సీఎం చంద్రబాబు భయపడ్డారా? ఈ విషయంలో అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని భావించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తుని రైలు దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ముద్రగడ పద్మనాభం ఉండేవారు. ఆ కేసును రైల్వే కోర్టు కొట్టివేసింది. వైసిపి ప్రభుత్వం సైతం దానిని ఆహ్వానించింది. అయితే తాజాగా కోర్టు తీర్పు పై సవాల్ చేయాలని భావించింది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక ఉత్తర్వు కూడా జారీచేసింది. కానీ ఒక్కరోజు వ్యవధిలో ఆ జీవోను వెనక్కి తీసుకుంది. అయితే కేవలం ముద్రగడకు భయపడి.. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని భావించి దానిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కీలక డిమాండ్లు ఇవే..
* సుదీర్ఘ నేపథ్యం..
ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, కాపు ఉద్యమ ప్రస్థానం తీసుకుంటే.. ఆయన సాధించిన విజయం కంటే.. ఆయనను వ్యతిరేకించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం మొండిఘటం. 1990 దశకంలో మంచి పట్టు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టగలిగారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ( Kotla Vijaya Bhaskar Reddy ) వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికప్పుడు జీవో 30 జారీ చేసి.. కాపులను బీసీల్లో చేర్చుకున్నట్లు ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. అప్పటినుంచి ముద్రగడ పేరు మార్మోగిపోయింది. ముద్రగడ గ్రాఫ్ కూడా పెరిగింది.
* చంద్రబాబుకు సమకాలీకుడు..
వాస్తవానికి ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు( CM Chandrababu) సమకాలీకుడు. 1978లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు. అలాగే ముద్రగడ సైతం ఆ ఏడాది ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. అటు తరువాత ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. కానీ ఆది నుంచి చంద్రబాబు అంటే ముద్రగడకు వేరే అభిప్రాయం ఉంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపుల విషయంలో హామీ ఇచ్చారు. ఆ చిన్న హామీని పట్టుకుని పెద్ద ఉద్యమం చేశారు. తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో డామేజ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేశారు. కాపుల గురించి మాట్లాడడం తగ్గించేశారు.
* కేవలం ఆ కారణంతోనే..
అయితే అప్పట్లో తుని రైలు ఘటన కేసు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావించింది. అయితే ఇంకా కాపు ఉద్యమనేతగా ముద్రగడ పద్మనాభం కు గుర్తింపు ఉంది. ఆపై ఆయన ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు గానీ కాపులకు వైసీపీ శ్రేణులు తోడైతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. నెగిటివ్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఆ భయంతోనే ఉత్తర్వులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనవసరంగా ముద్రగడ పద్మనాభం కు హైలెట్ చేసినట్టు అవుతుందని.. ఆయన వైసీపీలో ఉన్న పెద్దగా ప్రయోజనం లేదని.. ఆయన గ్రాఫ్ పెంచేలా ఉత్తర్వులు జారీ చేయడం ఏంటనేది చంద్రబాబుకు సన్నిహితుల నుంచి సూచన వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ముద్రగడ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.