Tamil Nadu Budget: ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. అతుకుల బొంత. ఎప్పుడైనా కూలిపోవచ్చు. మద్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు..
ఇవి ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు విజయ్ గవర్నమెంట్ మీద.. గవర్నెన్స్ మీద ఆయన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం మూడు నెలలు కూడా పూర్తికాకముందే.. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలపాటు హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుందని తెలిసి కూడా.. స్టాలిన్ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. విజయ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో నూతన వధువులకు 8 గ్రాముల బంగారం… పట్టు చీరలు.. ప్రభుత్వ వైద్యశాలలో జన్మించిన పిల్లలకు బంగారు ఉంగరాలు.. కాలేజీ విద్యార్థులకు లాప్టాప్ లు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. వంటి హామీలను విజయ్ ప్రకటించారు. ఈ హామీలు అమలు చేయాలని.. నూతన వధువులకు బంగారం.. పట్టు చీరలు ఇచ్చే అవకాశం లేదని.. ప్రభుత్వం వీటిని నిలబెట్టుకోలేదని.. అనేక సందర్భాలలో స్టాలిన్ విమర్శించడం ప్రారంభించారు. ఈ విమర్శలకు టీవీకే నేతలు పెద్దగా స్పందించలేదు. విజయ్ కూడా రియాక్ట్ కాలేదు.
టైం చూసి దెబ్బ కొట్టడం విజయ్ కి అలవాటు. సినిమాల్లో అయితే విలన్ ను ఎలా కొడతాడో.. రియల్ లైఫ్ లో కూడా తన ప్రత్యర్థిని కూడా అలాగే విజయ్ దెబ్బ కొట్టాడు. తమిళనాడు బడ్జెట్లో విజయ్ తన తిరుగులేని వ్యూహాత్మకత విధానాన్ని ప్రదర్శించాడు.. ప్రతిపక్షాలు అంచనా వేయలేని విధంగా తమిళ ప్రజల మీద వరాల జల్లు కురిపించాడు. నూతన వధువులకు 8 గ్రాముల బంగారం.. పట్టుచీర అందించడానికి 912 కోట్లు కేటాయించింది విజయ్ ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారు ఉంగరం ఇచ్చేందుకు 560 కోట్ల కేటాయించింది. కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించడానికి 2000 కోట్లు కేటాయించింది. తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రాయితీ 25వేల నుంచి 35వేలకు పెంచింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదలకు అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ హామీల మీద విజయ్ ప్రభుత్వాన్ని పదేపదే డిఎంకె ప్రశ్నిస్తోంది. వీటిని అమలు చేయాలని కోరుతూ ఉంది. దీనిపై విజయ్ ఇంతవరకు మాట్లాడలేదు. చివరికి బడ్జెట్లో తన కేటాయింపుల ద్వారా డీఎంకే చేస్తున్న ఆరోపణలకు సాలిడ్ సమాధానం ఇచ్చారు. అంతేకాదు తాను మాట ఇస్తే మడమతిప్పే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో టీవీకే నేతలు సోషల్ మీడియాలో ఎదురు దాడి మొదలు పెట్టారు. డీఎంకే నేతలను లక్ష్యంగా చేసుకొని.. ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు.