Botsa Satyanarayana: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. మరో మూడు ఏళ్ల పాలన ఉంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కూటమి. పుంజుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కూటమి ఎంత మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. మరోవైపు వైసీపీ గ్రాఫ్ తగ్గుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. వైసిపి నేతలపై కేసులు, అరెస్టుల పర్వం సైతం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత బొత్స పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆయన మనసు మారడానికి ప్రధాన కారణం ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది.
* సీనియర్ మోస్ట్ లీడర్..
ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స. రాజశేఖర్ రెడ్డి సమకాలీకుడు అనేకంటే ఆయన ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగిన నేత కూడా. సాధారణ పిఎసిఎస్ అధ్యక్షుడిగా ఉన్న బొత్స 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రి అయ్యారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దించారు. సీనియర్ నేతగా ఉన్న పెనుమత్స సాంబశివరాజును వెనక్కి నెట్టి మరి జిల్లా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఏకంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ సమీకరణల దృష్ట్యా చేజారిపోయింది. అయితే ముఖ్యమంత్రితో సమానమైన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కింది.
* వైసిపి గ్రాఫ్ తగ్గుతుండడంతో..
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఆ పార్టీలో చేరిన బొత్స ఫ్యామిలీ.. మొత్తం గెలిచింది.. ఐదు సంవత్సరాల పాటు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు బొత్స. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇచ్చారు బొత్సకు. ఏకంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చారు. అయితే వైసిపి గ్రాఫ్ ఇప్పుడు ఆందోళన పరుస్తోంది. అందుకే ఇక్కడ ఉండడం కంటే జనసేనలో చేరడం ఉత్తమమని బొత్స ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
* జనసేనకు లైన్ క్లియర్..
విజయనగరంలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేయడం.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పాలిటిక్స్ చేయడంతో ఆ పార్టీలో చేరే ఛాన్స్ లేదు. అందుకే జనసేనలో బొత్సని చేర్పించి.. ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కూడా ఒక ప్రచారం నడుస్తోంది. చిరంజీవితో బొత్స కు మంచి సంబంధాలు నడిచాయి. అప్పట్లో ఆయన చొరవతోనే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయింది. ఆ చనువును కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే బొత్స పవన్ కళ్యాణ్ కు దగ్గర అవుతారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రతో పాటు ఏపీ రాజకీయాల్లో ఒక షేక్ తప్పదు.