Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నం అవుతోంది. కేవలం 11 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా తరహాలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. అత్యున్నత వసతులతో 2027 గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. దక్షిణ భారతదేశంలో మహా కుంభమేళాగా భావించే ఈ పుష్కరాలకు కోట్ల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అందుకే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. గ్లోబల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఒక భారీ ఈవెంట్ గా నిర్వహించాలని చూస్తోంది. మొత్తం వ్యయం రూ.8,500 కోట్లు కాగా.. తొలి విడత మౌలిక వసతులు, ఘాట్ల విస్తరణ పనుల నిమిత్తం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.530 కోట్లను అధికారికంగా మంజూరు చేసింది.
* ఇంకా నెలల వ్యవధి..
వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు భాగస్వామ్యం అవుతున్నాయి. అందుకే శాఖల పరంగా ఈ నిధుల కేటాయింపు కూడా జరిగింది. గత అనుభవాల దృష్ట్యా తీరంలో పుష్కరాల ఘాట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. 238 పాత, కొత్త పుష్కర ఘాట్ల ఆధునీకరణ, మరమ్మత్తులు, నిర్మాణాలు చేపడుతున్న నీటిపారుదల శాఖకు అత్యధికంగా రూ.210.06 కోట్లు కేటాయించారు. పట్టణ మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ పనుల నిమిత్తం పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.150 కోట్లు విడుదల కాగా.. గోదావరి తీరమంతా నిరంతర విద్యుత్ సరఫరా, తాత్కాలిక సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఇంధన శాఖకు రూ.100 కోట్లు కేటాయించారు. దీంతోపాటు ఆలయాల సుందరీకరణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు దేవాదాయ శాఖకు రూ.60 కోట్లు, పర్యాటకశాఖ తో పాటు సాంస్కృతిక ప్రదర్శనల విస్తరణకు 10 కోట్ల నిధులు కేటాయించారు.
* డిజిటల్ టెక్నాలజీతో..
గత అనుభవాల దృష్ట్యా ఈసారి పుష్కరాలలో డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షలాదిమంది భక్తులు ఒకేసారి తరలి రానుండడంతో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిసిటీవీ నెట్వర్క్, డ్రోన్ సర్వై లెన్స్, రియల్ టైం కంట్రోల్ రూమ్ లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. భక్తులు తాము స్నానం చేయాలనుకునే ఘాట్లు, స్లాట్ బుకింగ్, ట్రాఫిక్ రూట్ మ్యాప్స్, అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాలు, అత్యవసర వైద్య సేవల సమాచారాన్ని చాలా సులువుగా తెలుసుకునేలా ప్రత్యేకంగా మొబైల్ యాప్ లు, క్యూఆర్ కోడ్ నావిగేషన్ సిస్టంను అందుబాటులోకి తీసుకురానున్నారు.
* నీరు కలుషితం కాకుండా..
సాధారణంగా పుష్కర సమయంలో నదిలో నీరు కాలుష్యంగా మారుతుంది. కలుషితం కాకుండా ప్రత్యేక ఫిల్టరేషన్ గ్రిడ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్లాస్టిక్ రహిత పుష్కరాలుగా భావిస్తున్నారు. ప్రతిఘాట్ వద్ద 24 గంటలపాటు వైద్య ఆరోగ్య టీం అందుబాటులో ఉండనుంది. అంబులెన్స్లతోపాటు పారిశుధ్య సిబ్బంది, స్విమ్మింగ్ నిపుణులను సైతం అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను వేగంగా పనిచేసేలా చర్యలు చేపట్టనున్నారు. రాజమండ్రి, కోవూరు, నరసాపురం, భద్రాచలం పరిసర ప్రాంతాల గోదావరి తీరాలను పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దనన్నారు. కేవలం పుష్కర స్నానం మాత్రమే కాదు.. ఈ వేడుకలను భవిష్యత్తులో కూడా తలచుకునేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.