Botsa Satyanarayana: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఓ రాజకీయ పరిణామం కుదిపేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి.. అదే పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పై టార్గెట్ చేసుకున్న ఆయన పార్టీ మారబోతున్నారు అంటూ బొత్సపై వ్యాఖ్యానించారు. త్వరలో జనసేనాలో బొత్స ఫ్యామిలీతో పాటు చేరుతారు అన్నది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. అయితే దీనిని ఖండించలేకపోతున్నారు బొత్స.. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించే క్రమంలో మీడియా ముందుకు వచ్చారు బొత్స. జనసేనలో చేరుతారు అన్న విలేకరుల ప్రస్తావనను చాలా లైట్ గా తీసుకున్నారు. బలంగా ఖండించకపోవడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
* కాంగ్రెస్ లోనే సుదీర్ఘం..
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు బొత్స. మొత్తం ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగడంతో పాటు రాజకీయ ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శించారు. ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన వైసీపీలో చేరారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగే వారు. అనుకోని రీతిలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో సత్తా చాటి ఐదేళ్లపాటు రాష్ట్రానికి మంత్రిగా కూడా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బొత్సను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని చేసి శాసనమండలిలో విపక్ష నేత బాధ్యతను అప్పగించారు జగన్. అయితే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా.. పిల్లల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బొత్స ఫ్యామిలీతో సహా జనసేనలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మీడియా ముందుకు వచ్చి తాను జనసేనలో చేరడం లేదని.. ఇన్ని అవకాశాలు ఇచ్చిన జగన్ వెంట ఉంటానని మాత్రం చెప్పడం లేదు.
* కేవలం విజయసాయిరెడ్డి పై..
గతంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న తనను సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర చేసి.. జగన్తో తప్పించారని తాజాగా విజయసాయిరెడ్డి ఆరోపించారు. పనిలో పనిగా పార్టీ మారబోతున్న ఓ మాజీ మంత్రి పాత్ర ఉందంటూ బొత్స సత్యనారాయణ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అయితే అదే విజయసాయిరెడ్డి విమర్శలను తిప్పికొట్టే క్రమంలో మీడియా ముందుకు వచ్చారు బొత్స. విజయసాయి రెడ్డి పై విమర్శలు చేశారే తప్ప.. తాను పార్టీ మారుతానన్న అంశంపై మాట్లాడలేదు. విలేకరులు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ కి ఈ పని లేదు.. తనకు పని లేదు అంటూ కామెడీగా సమాధానం చెప్పారు. కచ్చితంగా తాను వైసీపీని వీడడం లేదని.. అదే పార్టీలో కొనసాగుతానని మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో వైసిపి శ్రేణుల్లో మరింత అనుమానం బలపడుతోంది.. చివరకు బొత్స ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
View this post on Instagram