Botsa Satyanarayana: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానిని ఆయన నేరుగా ఖండించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. జనసేనలో చేరేది లేదని కరాకండిగా చెప్పడం లేదు. దీంతో పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. మరోవైపు బొత్సకు ప్రత్యామ్నాయంగా జగన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స వెళ్ళిపోతే జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు గట్టి వ్యూహం అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే బొత్స వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఏడాదిన్నర కిందటే ప్రయత్నం చేశారని… కానీ వెళ్లకుండా జగన్ కట్టడి చేశారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్న ఒక ప్రచారం.
* ఫ్యామిలీలో చీలిక..
అయితే బొత్స జనసేనలో చేరితే ఫ్యామిలీ మొత్తం వెళ్తుందా? లేకుంటే ఆయన ఒక్కరే వెళ్తారా? అనే చర్చ నడుస్తోంది. సాధారణంగా విజయనగరం అంటేనే బొత్స ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. జిల్లా మొత్తం ఆ కుటుంబ హవా ఉంటుంది. చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించే బొత్స మంత్రిగా వ్యవహరించారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీ ఎంపీగా ఉండేవారు. తమ్ముడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉండేవారు. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా సమీప బంధువు అప్పలనాయుడు కొనసాగే వారు. ఆపై జిల్లా పరిషత్ చైర్మన్ గా మేనల్లుడు శ్రీనివాసరావు వ్యవహరించేవారు. అయితే 2014లో ఆ కుటుంబం అంతా ఓడిపోయింది. 2024లో ఆ ఫ్యామిలీ మొత్తం ఓటమిచవి చూసింది. సుదీర్ఘకాలం రాజకీయం చేయడంతో ఆ కుటుంబంలో సైతం ఆశించిన స్థాయిలో ఐక్యం లేదని తెలుస్తోంది. అందుకే బొత్స తన రాజకీయ వారసుల కోసం పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు అన్నది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
* నెల్లిమర్ల పంచాయితీ..
2024 ఎన్నికల కు ముందు కుటుంబంలో ఒక రకమైన విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నెల్లిమర్ల నియోజకవర్గం పై పట్టు సాధించేందుకు బొత్స సోదరుడు లక్ష్మణరావు ప్రయత్నించగా.. ఎమ్మెల్యేగా ఉన్న అప్పలనాయుడు గట్టిగానే ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే అప్పలనాయుడు బొత్స సత్యనారాయణ కు స్వయాన మేనకోడలి భర్త. చిన్న శ్రీను సోదరి అప్పలనాయుడు భార్య. కానీ నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స లక్ష్మణరావు జోక్యాన్ని సహించుకోలేకపోయారు ఎమ్మెల్యే అప్పలనాయుడు. అలా ప్రారంభమైన విభేదాలు ఆ కుటుంబం మొత్తాన్ని చుట్టుముట్టినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం విషయంలో చిన్న శ్రీను పట్టుపడుతున్నారు. కానీ అక్కడ తన కుమార్తెను పెట్టాలని బొత్స భావిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో కొన్ని ధిక్కారస్వరాలు వినిపిస్తున్నాయి. దాని వెనుక చిన్న శ్రీను.. ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది బొత్స అనుమానం.
* పిల్లల కోసమే..
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బొత్స. ఇటువంటి సమయంలోనే పొలిటికల్ గా తమ వారసులను సిద్ధం చేయాలని చూస్తున్నారు. అయితే చిన్న శ్రీను రూపంలో జగన్మోహన్ రెడ్డి బొత్స హవాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ప్రచారం. వాస్తవానికి ఏడాదిన్నర కిందట బొత్స జనసేనలో చేరేందుకు అన్ని చర్చలు ప్రారంభమయ్యాయి. పవన్ సైతం సానుకూలత వ్యక్తం చేశారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసి బొత్స కు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. శాసనమండలలో వైసిపి పక్ష నాయకుడిగా అవకాశం కల్పించి బ్రేక్ వేశారు జగన్. కానీ ఇప్పుడు బొత్స వైఖరి మారుతుండడంతో చిన్న శ్రీను ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారట జగన్. అయితే ఇప్పుడు పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరేందుకు బొత్స సీరియస్ గా ఆలోచిస్తున్నారు అనేది బలమైన ప్రచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి.