Pakistan Rawalpindi : పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. జియా–ఉల్–హక్, అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్, పర్వేజ్ ముషారఫ్ లాంటి నాయకుల కాలంలో ప్రత్యక్ష లేదా పరోక్ష నియంతృత్వం కనిపించింది. ఈ తరహాలోనే ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నాయకత్వంలో సైనిక శక్తి మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణలు, కొత్త చట్టాలు, సైనిక మోహరింపులు దీనికి ఆధారాలుగా నిలుస్తున్నాయి.
రావల్పిండిలో సైనిక మోహరింపు..
2026 ఆగస్టు 21న ఫెడరల్ ప్రభుత్వం ఆర్టికల్ 245 కింద రావల్పిండిలో మూడు సైనిక కంపెనీలను ఆరు నెలలపాటు మోహరించేందుకు అనుమతి ఇచ్చింది. పంజాబ్ హోమ్ డిపార్ట్మెంట్ అభ్యర్థన మేరకు ఇది జరిగింది. అధికారికంగా ‘సెన్సిటివ్ సెక్యూరిటీ డ్యూటీస్’, ‘అనవసర పరిస్థితులు నివారణ’, జిల్లా పరిపాలనకు సహకారం అని చెప్పారు. రావల్పిండి సైనిక జనరల్ హెడ్క్వార్టర్స్ ఉన్న ప్రాంతం కావడం వల్ల దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ఈ నిర్ణయానికి మూడు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
పీటీఐ లాంగ్ మార్చ్ అడ్డుకోవాలి..
ఈ నిర్ణయం సెప్టెంబర్ 27న ప్లాన్ అయిన పీటీఐ లాంగ్ మార్చ్కు కొన్ని వారాల ముందు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జైలు హక్కులు, కేసులు సంబంధించి పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రికి తరలించి తిరిగి జైలుకు తీసుకెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. సైనిక మోహరింపు పూర్తి నియంత్రణ కాదు; సివిల్ అడ్మినిస్ట్రేషన్కు సహాయకంగా ఉంటుందని అధికారిక వైఖరి. అయినా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది జాగ్రత్త చర్యగా కనిపిస్తోంది.
ఆసిమ్ మునీర్ అధికారాల విస్తరణ..
రెండో కారణం గత సంవత్సరం 27వ రాజ్యాంగ సవరణ ద్వారా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్) పోస్ట్ ఏర్పాటైంది. ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్గా ఉండగానే ఈ బాధ్యతలు చేపట్టారు. 2026 ఆగస్టులో డిఫెన్స్ ఫోర్సెస్ యాక్ట్ 2026తో సైన్యం, నావికా, వాయుసేనలపై ఏకీకత కమాండ్, సిబ్బంది నియామకాలు, రిటైర్మెంట్, సర్వీస్ పొడిగింపు లాంటి విస్తృత అధికారాలు వచ్చాయి. ఫీల్డ్ మార్షల్ హోదా, కొన్ని రక్షణలు కూడా ఉన్నాయి. ఇవి గత సైనిక పాలకుల లాంటి ప్రత్యక్ష అధికారం కాకపోయినా, సివిల్–సైనిక సమతుల్యతను మరింత సైన్యం వైపు మళ్లిస్తున్నాయి.
రాజకీయ, రాజ్యాంగ ప్రతిపాదనలు..
ఓటింగ్ వయస్సు 18 నుంచి 25కు పెంచే ప్రతిపాదనలు గతంలో చర్చల్లోకి వచ్చాయి. కొందరు సలహాదారులు మాట్లాడినా, ప్రభుత్వం అధికారికంగా తిరస్కరించింది. ప్రావిన్సుల పునర్వ్యవస్థీకరణ, గిల్గిట్–బాల్టిస్తాన్ను రాష్ట్రంగా చూపడం, సూపర్ సెనేట్ ఏర్పాటు లాంటివి కూడా చర్చల్లో ఉన్నట్లు చెప్పబడుతున్నాయి. కానీ ఇవి ఇంకా అధికారిక రూపం తీసుకోలేదు. అమలైతే యువకుల ఓటు హక్కు, ప్రాంతీయ సమతుల్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ ఇప్పటికీ బలంగా ఉండడం, పీటీఐ ఉద్యమాలు సైనిక–ప్రభుత్వ వ్యూహాలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్గత సవాళ్లు..
బలూచిస్తాన్లో విభజనవాద గ్రూపులు స్వాతంత్య్రం ప్రకటనలు, స్వతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ గుర్తింపు లేదు, పాకిస్తాన్ నియంత్రణ కొనసాగుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, పీవోకేలో కూడా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇవి దేశ అంతర్గత బలహీనతలను చూపుతున్నాయి. కశ్మీర్ సమస్యపై అమెరికా వంటి దేశాల స్పష్ట వైఖరి కూడా పాక్ వ్యూహాలను ప్రభావితం చేస్తోంది.
ప్రస్తుత పరిణామాలు పూర్తి సైనిక తిరుగుబాటు లాంటివి కావు. సివిల్ ప్రభుత్వం అనుమతితో సైన్యం సహాయక పాత్రలో ఉంది. అయినా ఆసిమ్ మునీర్ అధికారాల విస్తరణ, రావల్పిండి మోహరింపు, పీటీఐ ఉద్యమాలపై నియంత్రణ చర్యలు సైన్యం రాజకీయంగా మరింత బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. చరిత్రలో ఇలాంటి పరిణామాలు తరచుగా అధ్యక్ష పాలన లేదా మరింత కేంద్రీకృత అధికారం వైపు దారి తీశాయి. అంతర్గత అశాంతి, ఆర్థిక సవాళ్లు, ప్రాంతీయ సమస్యలు కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.