Rahul Gandhi Pune Event : మహారాష్ట్రలోని పూణెలో ఇటీవల జరిగిన ‘ఛాత్రోన్ కి గూంజ్’ కార్యక్రమం కాంగ్రెస్ నిర్వహించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యువతతో ముఖాముఖి సంభాషణకు వేదికైంది. ముఖ్యంగా యువతులపై దృష్టి సారించి, వారి ఆత్మవిశ్వాసం పెంపొందించే భాషను వాడారు. ఇది కేవలం ఎన్నికల వ్యూహం కాదని, సామాజిక మార్పు కోసం జెన్జీని చేరువ చేసుకునే ప్రయత్నమని కనిపిస్తోంది. మనుస్మృతి మనస్తత్వం, పితృస్వామ్య వ్యవస్థపై విమర్శలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి.
మనుస్మృతి, స్వాతంత్య్రం..
రాహుల్ గాంధీ ప్రసంగంలో మనుస్మృతి నుంచి ఒక భాగాన్ని ఉటంకించారు. స్త్రీ బాల్యంలో తండ్రికి, యవ్వనంలో భర్తకు, వృద్ధాప్యంలో కొడుకులకు లోబడి ఉండాలనే భావనను ‘అవమానకరం’గా అభివర్ణించారు. స్త్రీలు ఎవరికీ చెందినవారు కాదు, తమకు తామే చెందినవారని నొక్కి చెప్పారు. కుమార్తె, భార్య, తల్లి పాత్రలు మాత్రమే గుర్తింపు కాకూడదని, వారు స్వతంత్ర వ్యక్తులుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ‘‘బిగ్గరగా మాట్లాడండి, గర్వంగా ఉండండి, సమాజంలో మీ స్థానం కోసం పోరాడండి’’ అని యువతులను ఉద్దేశించి మాట్లాడారు. పితృస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనే నినాదం కూడా వినిపించింది. ఈ భాష భారతీయ సంప్రదాయ చర్చల్లో కొత్తది కాదు. అయితే జాతీయ నాయకుడు యువతుల ముందు నేరుగా ఇలా మాట్లాడటం రాజకీయంగా గమనార్హం. రాబోయే రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో యువతీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు.
గత సంఘటనల నుంచి ప్రస్తుత వ్యూహం..
కొన్నేళ్ల క్రితం ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) సీఈవో జాక్ డోర్సీ భారత పర్యటనలో ‘బ్రాహ్మణికల్ పేట్రియార్కీని ధ్వంసం చేయండి’ అనే పోస్టర్ను పట్టుకున్న ఫోటో వివాదాస్పదమైంది. అప్పుడు కొందరు దాన్ని రాహుల్తో అనుసంధానం చేశారు. ఆయన తనకు తెలియకుండా జరిగిందని వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి భావజాలం విదేశీ లేదా స్వచ్ఛంద సంస్థలు, ఫెమినిస్ట్ వర్గాల ద్వారా ప్రచారం పొందిందనే విమర్శలు ఉన్నాయి. రాహుల్ వివిధ దేశాల్లో పర్యటించి, సామాజిక ఉద్యమాలను అధ్యయనం చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్..
2017లో ఏర్పాటైన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ వంటి వేదికలు మేధావులు, నిపుణులు, వృత్తి నిపుణులను పార్టీకి చేరువ చేసేందుకు సహాయపడ్డాయి. భారత్ జోడో యాత్ర సమయంలో స్వచ్ఛంద సంస్థలు, వామపక్ష వర్గాల మద్దతు కనిపించింది. ఇలాంటి అంశాలు పార్టీ వ్యూహంలో భాగమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
యువత ఆకర్షణ..
జెన్జీకి దగ్గరవ్వాలనే ప్రయత్నం స్పష్టం. విద్య, ఉపాధి, సామాజిక ఒత్తిడులు వంటి అంశాలు వారి మనసులో ఉన్నాయి. అభిజిత్ దీప్కే వంటి ప్రభావవంతమైన వ్యక్తుల వైపు యువత మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రగతిశీల విలువలతో ఆకర్షించాలని చూస్తోంది. నిర్భయ కేసు తర్వాత స్త్రీ సంరక్షణ, హక్కుల చర్చలు బలపడ్డాయి. ఇప్పుడు ఆ భాషను రాజకీయ వేదికపై తీసుకురావడం కొత్త కోణం. అయితే ఈ వ్యూహం సవాళ్లు లేకుండా లేదు. సంప్రదాయ విలువలను దెబ్బతీస్తోందనే విమర్శలు, పార్టీలోనే వివిధ అభిప్రాయాలు, ఓటర్లలో విభజన ప్రమాదం ఉన్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బలహీనపడిన నేపథ్యంలో, పార్టీ వేదికలు ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని కూడా చెప్పవచ్చు.
పూణె కార్యక్రమం కేవలం ఒక సమావేశం కాదు. యువతుల స్వయం నిర్ణయాధికారం, సామాజిక నియంత్రణలపై ప్రశ్నలు లేవనెత్తడం రాజకీయ చర్చను విస్తతం చేస్తోంది. ఇది ఓటు బ్యాంకు వ్యూహమా, లోతైన సామాజిక మార్పు కోసం ప్రయత్నమా అనేది కాలం నిర్ణయిస్తుంది. భారతీయ సమాజంలో పితృస్వామ్యం, స్త్రీ స్థానం గురించిన చర్చలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని జాతీయ రాజకీయాల్లో కేంద్రంగా తీసుకురావడం కొత్త దశను సూచిస్తోంది.