Revanth Reddy: ఈమధ్య ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు అనుకుంటా.. ఎందుకంటే గతంలో ఆయన కొత్త పలుకు సంపాదకీయం రాసినప్పుడు సూటిగా సుత్తి లేకుండా పాయింట్లోకి వచ్చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఒక ఉపోద్ఘాతాన్ని భలే తెలివిగా వాడారు. అది కూడా ఒక సినిమా డైలాగ్ తో మొదలుపెట్టారు. సినిమాలలో చిన్న పిల్లల చేత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిస్తుంటారని.. కొన్ని సందర్భాల్లో అవి బాగుంటాయని.. మిగతా సందర్భాల్లో అతిగా అనిపిస్తుంటాయని రాధాకృష్ణ రాస్కొచ్చారు.
తద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ముదురు పిల్లాడు అని చెప్పకనే చెప్పేశారు. రాధాకృష్ణ తన సంపాదకీయంలో ఏమీ దాచుకోలేదు. మిత్రమా అంటూనే రాజగోపాల్ రెడ్డికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశారు.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో తెలంగాణకు వెళ్లాలి అంటే వీసా కావాలి అన్నప్పుడు.. నువ్వెందుకు నోరు సవరించలేదు.. నాడు ఎందుకు రాజశేఖర్ రెడ్డిని ప్రతిఘటించలేదు.. తెలంగాణ ఉద్యమకారుడివి అని చెప్పుకుంటున్నావు కదా.. జానారెడ్డి లాంటి నాయకుడిని పక్కన పెట్టినప్పుడు.. జయపాల్ రెడ్డి లాంటి నాయకుడిని ఢిల్లీకి మాత్రమే పరిమితం చేసినప్పుడు.. నాడు ఎందుకు అడగలేదు.. కమాన్ సమాధానం చెప్పు మిస్టర్ రాజ గోపాల్ రెడ్డి.. మమ్మల్ని ఆంధ్ర మీడియా అంటున్నావు కదా.. మరి నువ్వు ఇతర రాష్ట్రాలలో ఎందుకు వ్యాపారాలు చేస్తున్నావ్.. ఎందుకు అక్కడ టెండర్లు వేస్తున్నావ్.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి.. పలు ఉదాహరణలతో నోరు పెకలకుండా చేశారు.. 100 కాకపోతే వెయ్యి చానల్స్ పెట్టుకో.. 1000 పత్రికలు పెట్టుకో.. నిన్ను కాదన్నది ఎవరు.. అంతస్థాయి ఉన్నవాడివి మంత్రి పదవి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు అంటూ ఓపెన్ గానే రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. ఏమాటకు ఆ మాట రాజగోపాల్ రెడ్డి విషయంలో రాధాకృష్ణ తన విశ్వరూపం చూపించారు. చాలా రోజుల తర్వాత మసాలా లాంటి వాక్యాలతో అదరగొట్టారు.
రాజగోపాల్ రెడ్డి వంతు అయిపోయిన తర్వాత నేరుగా రేవంత్ రెడ్డి వద్దకు వచ్చారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్వరాలు ఏకం కావడాన్ని రాధాకృష్ణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. ఇదే సమయంలో గులాబీ పార్టీ ఆ వ్యతిరేక వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వడం.. ఆ పార్టీ మీడియాలో సముచిత స్థానం కల్పించడం పట్ల రాధాకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన నాయకుడి కోసం బిజెపి అన్వేషణ జరుపుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం కుట్రలు చేస్తోందని.. రాష్ట్రంలో ఉన్న అసలు రాజకీయ ముఖచిత్రాన్ని రాధాకృష్ణ బయటపెట్టారు. రేవంత్ రెడ్డిని బలహీన పరచడానికి కుట్రలు జరుగుతున్నాయని.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పార్టీ నేతలకు సమయం ఇవ్వకపోవడం.. మంత్రులతో మాట్లాడకపోవడం.. ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రాధాకృష్ణ అసలు విషయాన్నీ బయట పెట్టారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన ధోరణి మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని.. భారత రాష్ట్ర సమితిని.. రాజగోపాల్ రెడ్డి ని.. రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఆడుకుని.. అసలు సిసలైన మాస్ మసాలా వంటకాన్ని ఈ వారం కొత్త పలుకులో రాధాకృష్ణ అందించారు.