RK Kothapaluku: తెలుగు నాట సాగుతున్న కక్ష రాజకీయాల పట్ల వేమూరి రాధాకృష్ణ తెగ బాధ పడిపోయారు. తన ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఆదివారం ఇదే విషయం మీద లోతుగా రాసుకుంటూ వచ్చారు. కెసిఆర్, రేవంత్ రెడ్డి మధ్య భారత్ పాకిస్తాన్ కంటే ఎక్కువ శత్రుత్వం ఉందని.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రేవంత్ రెడ్డి హుందాగా తీసుకోలేకపోతున్నారని.. అధికారం కోల్పోయారు కాబట్టి.. జనం ఇచ్చేంతవరకు ఎదురుచూసే ఓపిక కేసీఆర్ లో కనిపించడం లేదని వేమూరి రాధాకృష్ణ తన సంపాదకీయంలో వాపోయారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యల పట్ల.. కెసిఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేసి ఉంటే బాగుండేదని రాధాకృష్ణ సూచన చేశారు. హరీష్ రావు మీద.. కేటీఆర్ మీద లైంగిక వేధింపుల కేసులు పెట్టడం ఏంటి.. అధికార పక్షానికి కాస్త సహనం ఉండాలి కదా.. అన్నట్టుగా రాధాకృష్ణ రాసుకుంటూ పోయారు.
రాధాకృష్ణ రాసిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. చంపుతాం, నరుకుతాం అనే సవాళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండేవని.. ఇప్పుడు ఆ సంస్కృతి తెలంగాణకు కూడా వ్యాపించిందని రాధాకృష్ణ బాధపడిపోయారు. వాస్తవానికి మీడియా కూడా తక్కువేమీ కాదు. రాజకీయ నాయకులను మించిపోయింది. రాధాకృష్ణ సొంత పత్రికలో జగన్ మీద రాసిన రాతలు.. ఇప్పటికీ గూగుల్ లో చూస్తే కనిపిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు రాధాకృష్ణ కూడా సహనం అలవర్చుకుంటే బాగుండేది కదా. ఏదైనా మనదాక వస్తేనే అర్థం అవుతుంది. ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన ఒత్తిడిని తట్టుకొని రాధాకృష్ణ నిలబడ్డారు. కానీ, జగన్ మీద ఇప్పటికీ రాధాకృష్ణ రాస్తూనే ఉన్నారు. ఈ వ్యాసంలో కూడా జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు.
ఒక మీడియా అధినేతకే ఈ స్థాయిలో కోపం ఉంటే.. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి కోపం ఉండడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇంటలిజెన్స్ పోలీసులను అడ్డం పెట్టుకొని తనను అరెస్ట్ చేయించారని.. తన బిడ్డ పెళ్లికి కూడా చుట్టపు చూపులాగా వచ్చేలాగా చేశారని రేవంత్ మదిలో ఇప్పటికీ ఆ బాధ ఉంది. రేవంత్ చేతిలో అధికారం ఉంది. అవసరమైతే కేసీఆర్ను అరెస్ట్ చేయించగలడు. కేటీఆర్ ను.. హరీష్ రావు అని కూడా అదేదారిలోకి పంపించగలడు. కానీ రివెంజ్ తీర్చుకోవడానికి జైలు శిక్ష ఒకటే మార్గం కాదని.. అంతకుమించి అనే లాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇందులో రేవంత్ రెడ్డికి చేస్తున్న దానిని ఎవరూ అంగీకరించరు. కాకపోతే గులాబీ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి కుటుంబం మీద తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల.. ఆయన రివెంజ్ తీర్చుకోవాల్సిందేనని మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టులు పెట్టడమే కాదు గ్రూపులు కూడా రన్ చేస్తున్నారు.
రాజకీయ నాయకులు వ్యక్తిగత కక్షలను కార్యకర్తల మీద రుద్దడం తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా దర్జాగా సాగిపోతోంది. ఇది ముంజేతి కంకణం వ్యవహారమే. ఇది కొత్తమే కాదు. కాకపోతే రాధాకృష్ణ ఒక పాత్రకి విడిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు హితబోధ చేశారు. కాకపోతే ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు.. కెసిఆర్ తో ఇప్పుడు రాధాకృష్ణకు సయోధ్య లేదు. రేవంత్ రెడ్డి తో ఉన్నా.. ఆయన వినిపించుకునే పరిస్థితిలో లేడు. రాధాకృష్ణ ఏదో ప్రయాసపడి రాశారు గాని.. అది కేవలం ఒకరోజు చర్చకు మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు తిట్టడానికి ఒక వ్యక్తి ఉండాలి. కక్ష సాధించుకోవడానికి ఒక టార్గెట్ అంటూ ఉండాలి. లేకపోతే వాళ్లు చేసే రాజకీయాలలో పస ఉండదు. మీడియా రాయడానికి మసాలా ఉండదు. చివరికి రాధాకృష్ణ లాంటివాళ్ళు సంపాదకీయం రాయడానికి కూడా ఓ కారణమంటూ ఉండదు.