telangana politics : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్పై చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్కు సంబంధించి 700 ఎకరాల భూమిపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని, తక్షణమే నోటీసులు ఇచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించడం పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న భూమిని పేద ఎస్సీలకు పంచుతామని స్పష్టం చేయడం, కేటీఆర్, హరీశ్ రావు, కవిత కుటుంబాల పేరిట ఉన్న వందలాది ఎకరాల ఆస్తుల వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
ఈ అనూహ్య నిర్ణయం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల భవిష్యత్తుపై రాబోయే రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లాభాలు
కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన ‘కఠిన వైఖరి’ని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుంది. ఎస్సీ, పేద వర్గాల మద్దతు దీన్ని బట్టి లభిస్తుంది. ఫాంహౌస్ భూములను స్వాధీనం చేసుకుని ఎస్సీలకు ఇస్తామన్న ప్రకటన దళిత, నిరుపేద వర్గాల్లో కాంగ్రెస్పై సానుకూలతను పెంచే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో డిఫెన్స్లో బిఆర్ఎస్ పడిపోయింది. గత ప్రభుత్వ అవినీతి, భూ ఆక్రమణలపై నేరుగా దాడి చేయడం ద్వారా ప్రతిపక్ష బిఆర్ఎస్ను రాజకీయంగా రక్షణత్మక వైఖరిలోకి నెట్టవచ్చు.
కాంగ్రెస్ ఎదుర్కొనే ముప్పులు.. రాజకీయ నష్టాలు
కేసీఆర్పై నేరుగా విచారణ, భూముల స్వాధీనం వంటి నిర్ణయాలను బిఆర్ఎస్ “రాజకీయ కక్షసాధింపు”గా చిత్రీకరించి, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నించవచ్చు. భూముల రికార్డులు, నోటీసుల ప్రక్రియలు న్యాయస్థానాల్లో చిక్కుకుంటే, ఇచ్చిన గడువులోగా స్వాధీనం చేసుకోలేకపోవడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. ఈ వివాదం ముదిరితే, ప్రభుత్వం తమ ఆరు గ్యారెంటీల అమలు నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ డ్రామా ఆడుతోందని బిఆర్ఎస్ బలంగా ప్రచారం చేసే అవకాశం ఉంది.
మొత్తానికి కేసీఆర్ ఫాంహౌస్ స్వాధీనం ఉదంతం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్ద ఎత్తుగడే అయినప్పటికీ, దీని ఆధారంగా విచారణను వేగంగా పూర్తి చేసి లీగల్ సవాళ్లను అధిగమిస్తేనే కాంగ్రెస్కు పూర్తి స్థాయి లాభం చేకూరుతుంది. లేనిపక్షంలో ఇది బిఆర్ఎస్కు సానుభూతి ఆయుధంగా మారే ప్రమాదం కూడా ఉంది.