Homeఆంధ్రప్రదేశ్‌RK Kotha Paluku: డియర్ ఆర్కే సార్.. నారా లోకేష్ జాకీలు పెడితే లేవలేదు.. కష్టపడ్డాడు...

RK Kotha Paluku: డియర్ ఆర్కే సార్.. నారా లోకేష్ జాకీలు పెడితే లేవలేదు.. కష్టపడ్డాడు కాబట్టి ఎదిగాడు..

RK Kotha Paluku: నారా లోకేష్ పప్పు కాదు.. నిప్పు అని నిరూపించుకున్నాడు.. ఇది అతనిలో పరిపక్వతకు నిదర్శనం.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకులో ఓ వాక్యం ఇది. ఇది చాలు నారా లోకేష్ వ్యక్తిత్వం గురించి చెప్పడానికి.. 2014లో మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ ను విమర్శించింది ఇదే రాధాకృష్ణ.. వైసిపి వాళ్ళ కంటే ఎక్కువగా నాడు ఆంధ్రజ్యోతి లోకేష్ శాఖలో జరుగుతున్న వ్యవహారాల మీద రాసింది.. ఒకరకంగా ఇది నారా లోకేష్ కు మంచి చేసింది.

ఎప్పుడైతే నారా లోకేష్ 2019 ఎన్నికల్లో ఓడిపోయారో.. ఆ తర్వాత వైసిపి ఆయన మీద దాడి మొదలుపెట్టింది. చంద్రబాబును కూడా ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. అది ఏపీ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. చివరికి ఆంధ్రజ్యోతి కూడా నారా లోకేష్ పాదయాత్రకు విపరీతమైన కవరేజ్ ఇవ్వాల్సి వచ్చింది.

ఆంధ్రజ్యోతి టిడిపికి అనుకూలమైన పత్రిక అయినప్పటికీ.. కొన్ని విషయాలలో విభేదిస్తూనే ఉంటుంది. నారా లోకేష్ ను నాడు మంత్రిని చేసినప్పుడు కూడా రాధాకృష్ణ విభేదించారు.. ఇప్పుడు అదే రాధాకృష్ణ నారా లోకేష్ ను మూడవ తరానికి అసలైన నాయకుడు అంటూ కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఈ స్థాయి దాకా రావడానికి నారా లోకేష్ చాలా ఇబ్బందులు పడ్డారు. తన భాషను ఇబ్బంది పెట్టారు. తన యాసను ఇబ్బంది పెట్టారు. చివరికి తన శరీర ఆకృతిని సైతం ఇబ్బంది పెట్టారు.

ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డవాడు.. ఏ స్థాయిలో రాటు తేలి ఉంటాడు.. లోకేష్ స్థానంలో మరొకరు గనుక ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ లోకేష్ పట్టుదల ఎక్కువగా ఉన్న వ్యక్తి. తండ్రి మాదిరిగానే సహనం ఉంటుంది. అన్నింటికీ మించి దూకుడు తనం ఉంటుంది. అందువల్లే కదా పార్టీలో తొలితరం కార్యకర్తలను తన వద్దకు పిలిపించుకుంటున్నారు. వారితో ఆత్మీయ విందు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు పార్టీ కార్యకర్తలతో ఈ స్థాయిలో మమేకం అవడం అంటే మామూలు విషయం కాదు.

పైగా ఇప్పుడు నారా లోకేష్ మామూలు వ్యక్తి కాదు. ఏపీ రాజకీయాలను మొత్తం శాసించగలుగుతున్నారు. అటు చంద్రబాబుతో.. ఇటు పవన్ కళ్యాణ్ తో ఏకకాలంలో సంబంధాలు కొనసాగిస్తూ రాజకీయంగా తన అడుగులు అత్యంత బలంగా వేస్తున్నారు. జనసేన విషయంలో గాని.. టిడిపి విషయంలో గాని.. బిజెపి విషయంలో గాని లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఏదైనా తప్పులు జరిగితే ఆగడం లేదు. వెంటనే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే నారా లోకేష్ భావి నాయకుడిగా ఎదిగారు. టిడిపికి ఆశా కిరణం లాగా కనిపిస్తున్నారు. చంద్రబాబు ఒకరి నాయకత్వాన్ని అంత ఈజీగా నమ్మరు. అటువంటిది నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించారంటేనే.. అతడి స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నారా లోకేష్ గురించి లోతుగానే రాధాకృష్ణ అధ్యయనం చేసినట్టు కనిపిస్తోంది. అందువల్లే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక వ్యాఖ్య కూడా నెగిటివ్గా చేయలేదు. పైగా చంద్రబాబు కి ఎదురైన పరిస్థితిని.. నారా లోకేష్ కు ఎదురవుతున్న పరిస్థితిని ఉటంకించి రాధాకృష్ణ రాశారు.. అలాగని నారా లోకేష్ కు కేక్ వాక్ ఉంటుందని అనుకోవడానికి లేదు. టిడిపిలో వ్యతిరేక స్వరాలు ఉంటూనే ఉంటాయి. నారా లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించని వర్గాలు కూడా ఉంటాయి. వారందరినీ కలుపుకొని పోవాలి.. వారందరితో కలిసి పని చేయాలి.. సరిగా ఇవే విషయాలను రాధాకృష్ణ చెప్పారు. అఫ్కోర్స్ టిడిపి అంటేనే రాధాకృష్ణకు ఒక రకమైన అభిమానం కాబట్టి.. ఇలాంటి రాతలు రాయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే నారా లోకేష్ గురించి చెబుతూ జగన్ ప్రస్తావన తీసుకురావడమే ఇక్కడ పంటికింద రాయి లాగా ఉంది..

ఏది ఏమైనప్పటికీ టిడిపి భవిష్యత్తు లోకేష్ చేతిలో భద్రంగా ఉంటుంది. అందులో అనుమానం లేదు.. అనుమానించాల్సిన అవసరం అంతకంటే లేదు. “1995లో ఏర్పడిన ఒక సంక్షోభం సీనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని మరోవైపు తీసుకెళ్లింది.. నారా చంద్రబాబు నాయుడు అనే నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో విభిన్నంగా పరిచయం చేసింది. ఆ వ్యక్తి అరాచకం గనుక లేకుంటే.. చంద్రబాబు ఏమైపోయేవారో” .. ఈ లైన్ మాత్రం ఆర్కే కొత్త పలుకులో హైలెట్. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular