Balineni Srinivasa Reddy: ఏపీలో కూటమిలో ప్రకంపనలు రేపింది ప్రకాశం జిల్లా వ్యవహారం. అక్కడ జనసేనకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ టిడిపి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన అన్నట్టు పరిస్థితి మారింది. వారిద్దరి మధ్య రెండు దశాబ్దాల వైరం ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన లో చేరారు. అప్పటినుంచి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎందుకంటే ఒంగోలులో మాత్రమే కాదు జిల్లా మొత్తం పై ప్రభావం చూపారు బాలినేని.. కాంగ్రెస్ పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన బాలినేని తీరుతో టిడిపి తో పాటు జన సైనికులు సైతం ఇబ్బందులు పడ్డారు. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో బాలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అప్పట్లోనే బాలినేని జనసేనలో చేరిక వెనుక అనేక రకాల అనుమానాలు వినిపించాయి. ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కూడా ప్రచారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి ప్రయోగంగా కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు బాలినేని జనసేనలో చేరికను.
* సుదీర్ఘ రాజకీయ చరిత్ర..
బాలినేనికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గుర్తించి 1999లో టిక్కెట్ ఇవ్వడంతో గెలిచారు. 2004లో రెండోసారి గెలిచారు. 2009లో మూడోసారి గెలవడంతో రాజశేఖరరెడ్డి పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు బాలినేని. మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. 2019లో గెలవడంతో మంత్రి పదవి ఇచ్చారు. అటు రాజశేఖరరెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పగలిగారు.
* జగన్ కు సమీప బంధువు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాత్రమే కాదు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. అందుకే ఆ బంధాన్ని విడిచిపెట్టి జనసేనలో చేరికను ఎక్కువమంది అనుమానించారు. అప్పట్లో జనసేనలో చేరిన తర్వాత ఆయన వైఖరి మాత్రం భిన్నంగా ఉండేది. అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి తో పాటు జనసేన నేతలు ఆయనను వ్యతిరేకించేవారు. ఒక ప్రత్యేక ఆలోచనతోనే ఆయన జనసేనలో అడుగు పెట్టారని.. దాని వెనుక జగన్ వ్యూహం ఉందని.. కూటమిలో చీలిక తెచ్చేందుకేనని చాలా రకాల కామెంట్స్ వినిపించాయి. అయితే కొద్ది రోజుల కిందట బాలినేని తిరిగి వైసిపి లోకి వెళ్తారన్న ప్రచారం కూడా సాగింది. కానీ ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనతో జరిగిన వివాదంతో బాలినేని పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమిలో చీలిక తెచ్చేందుకే బాలినేని జనసేనలో చేరారని.. ఈ చేరిక వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందనేది ఇప్పుడు టిడిపి నేతలు అనుమానం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.