Jetlee: నైజాం ప్రాంతం లో దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ మధ్య వైరం తారా స్థాయికి చేరుకుంది. ఎప్పుడైతే మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ప్రాంతం లో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నారో , అప్పటి నుండి దిల్ రాజు నుండి ఎదో ఒక సమస్య ఎదురు అవుతూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కమీషన్ బేసిస్ విధానం పై పెద్ద ఎత్తున పంచాయితీ నడుస్తోంది. కమీషన్ బేసిస్ సిస్టం మీద నడిచే సినిమాలకు మా థియేటర్స్ ని ఇచ్చే ప్రసక్తే లేదని ప్రొడ్యూసర్ గిల్డ్ ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ పంచాయితీ నడుస్తున్న సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి ‘జెట్లీ’ చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతం లోని ఏషియన్, SVC సంస్థలకు చెందిన మల్టీప్లెక్స్ థియేటర్స్ లో బ్యాన్ విధించారు.
దీంతో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP సంస్థకు సంబంధించిన డేసిగ్నేటెడ్ పార్ట్నర్ కేతిరెడ్డి శశిధర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఒక లేఖని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రాంతం లోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో వీక్లీ రెంటల్ సిస్టం పైన, రెవిన్యూ షేరింగ్ విధి విధానాలపైన ఏర్పడిన కొన్ని సమస్యల గురించి మాకు అవగాహన ఉంది. ఈ సమస్య పై మీ వైఖరి ని మేము అర్థం చేసుకున్నాము. ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే వరకు మీ థియేటర్స్ లో మా సంస్థకు సంబంధించిన సినిమాలను ప్రదర్శించారాదు అనే నిర్ణయాన్ని కూడా మేము అంగీకరించాము. కానీ మా లేటెస్ట్ చిత్రం ‘జెట్లీ’ విషయం లో మీరు తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సరైనది కాదు. మీ నియంత్రణ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మా చిత్రాన్ని బ్యాన్ చేశారు’.
‘మల్టీప్లెక్స్ విధానాల పై మన మధ్య ఎలాంటి విబేధాలు , సమస్యలు లేవు . అది పూర్తిగా సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించిన విషయం. అయినప్పటికీ కూడా మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మా సినిమాని నిలిపివేయడం అన్యాయమైన చర్య . ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా మాపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నట్టు అర్థం అవుతోంది. ఒక విభాగం లో మీ నిబంధనలను ఒప్పించడం కోసం, మరో విభాగం లో ఒత్తిడి తీసుకొని రావడం మంచి పద్దతి కాదు. అది భయపెట్టి , లొంగదీసుకునే ప్రయత్నం గానే మేము భావిస్తున్నాము. ఇలాంటి చర్యలు సినీ పరిశ్రమలో కొత్తగా చోటు చేసుకోవడం దురదృష్టకరం’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.