Ramoji Rao: ఎంత సంపాదించాడు రామోజీరావు.. ఈనాడు పేపర్ పెట్టాడు. దానికంటే ముందు అన్నదాత మ్యాగజిన్ తెరపైకి తీసుకొచ్చాడు. విపులను.. చతురను ఏకకాలంలో విజయవంతంగా నడిపించాడు. కళాంజలి పేరుతో బట్టల దుకాణం ఓపెన్ చేశాడు. రామోజీ ఫిలిం సిటీ కట్టాడు. డాల్ఫిన్స్ హోటల్స్ స్థాపించాడు. ఈనాడు పేపర్ ను తిరుగులేని స్థాయిలో నిలిపాడు. అనేక భాషలలో ఈటీవీ చానల్స్ ఏర్పాటు చేశాడు. ఇక్కడితోనే ఆగిపోయాడా.. లేదు లేదు సినిమాల తీశాడు.. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈటీవీ భారత్.. ప్రియా పచ్చళ్ళు.. ఈటీవి ఎఫ్ఎం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..
రామోజీ ఒక వటవృక్షం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. ఎక్కడో కృష్ణా జిల్లా పారుపూడి ప్రాంతంలో జన్మించిన ఆయన వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తన వారసులను కూడా ప్రకటించుకున్నారు. చివరికి తాను చనిపోయిన తర్వాత ఎక్కడ దహనం చేయాలో కూడా నిర్ణయించుకున్నారు. తన అంతిమ వేదికను కూడా నిర్మించుకున్నారు. అటువంటి రామోజీరావును ఇబ్బంది పెట్టింది ఉండవల్లి అరుణ్ కుమార్.. వైయస్ రాజశేఖర్ రెడ్డి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకున్న రామోజీరావుకు రాజశేఖర్ రెడ్డి రూపంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక దశలో మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన చికాకులు.. దానికి రాజశేఖర్ రెడ్డి అందించిన సహకారాలు మామూలువి కావు. ఒక దశలో నాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సపోర్ట్ ఇవ్వకపోతే రామోజీరావు పరిస్థితి దారుణంగా ఉండేది.. కానీ రామోజీరావు గడ్డి పిండం. తనకు ఏం కావాలో తెలుసు.. తన అవసరాలు ఎలా తీర్చుకోవాలో కూడా తెలుసు. రకరకాల ప్రయత్నాలు చేసి మార్గదర్శిని కకావికలం కాకుండా చూసుకున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వదలబొమ్మాలి అన్నట్టుగా మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు వెంటపడ్డారు. ఇబ్బంది పెట్టారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్గదర్శి వ్యవహారంలో అరుణ్ కుమార్ కు సహకరించారు. ఒక దశలో ఏపీ సిఐడి అధికారులతో రామోజీరావును విచారించారు. ఆ సమయంలో రామోజీరావు నడుముకు కట్లు కట్టుకొని.. రామోజీ ఫిలిం సిటీ లో తన నివాసంలో పడుకున్నారు. అప్పట్లో ఈ ఫోటోలను సాక్షి మీడియా ఎంత గొప్పగా ప్రచురించింది అంటే.. చూశారా మా జగన్ దమ్ము.. చివరికి ప్రధానమంత్రి సైతం తన ఇంటికి పిలిపించుకునే రామోజీరావును పడుకోబెట్టాడు.. నేల నాకించాడు అనే రేంజ్ లో రాసింది. వాస్తవానికి రామోజీరావు అలా పడుకుంటాడని.. సిఐడి అధికారులు ఆయన గుమ్మం తొక్కుతారని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాతే కదా చంద్రబాబు అరెస్టు జరిగింది..
మార్గదర్శి వ్యవహారంలో చివరికి రామోజీరావు గతించిన తర్వాత అనుకూలమైన తీర్పు వచ్చింది. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ను న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. అసలు మీకు ఎటువంటి హక్కు ఉందని మార్గదర్శి విషయంలో ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.. మీ వెనక రాజకీయ ప్రయోజనం ఉందేమో.. రాజకీయ ఉద్దేశం ఉందేమో అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన అభియోగాలను తోసిపుచ్చింది. అసలు ఈ కేసును డిస్మిస్ చేసింది. ఇంకోసారి ఇటువంటి చెత్త కేసులు వేసి మా టైం వేస్ట్ చేయొద్దని సూచించింది. దీంతో ఈనాడులో పండగ వాతావరణం.. రామోజీ ఫిలిం సిటీ లో కార్నివాల్.. అన్నింటికంటే ముఖ్యంగా రామోజీరావు ఆత్మకు శాంతి.. తెలంగాణలో అనుకూల ప్రభుత్వం.. ఆంధ్రాలో అనుకూల ప్రభుత్వం.. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం.. మార్గదర్శి విషయంలో అనుకూల తీర్పు.. ఈనాడు కిరణ్ కు ఇప్పుడు ఇంతకంటే కావాల్సిందేముంది.