TG20 League: ఈనాడు..తెలుగు మీడియాలో ప్రధాన పత్రిక.. వార్తలు, ఇతర వర్తమాన విషయాలకు ఈనాడులో చోటు ఉంటుంది. ముద్రణ మాధ్యమంలో ప్రథమస్థానంలో కొనసాగుతున్న ఈనాడు యాజమాన్యానికి క్రికెట్ కు ఏం సంబంధం..అదేకదా మీ డౌటు.. క్రికెట్ లో ఈనాడు ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ లో యంగ్ క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించిన క్రికెట్ లీగ్ టీజీ20 లో హైదరాబాద్ ఫ్రాంఛైజీని ఈనాడు అనుబంధ కంపెనీ ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ సొంతం చేసుకుంది. ఆటగాళ్ల మీద లక్షలు పెట్టుబడిగా పెట్టింది. తొలి సీజన్ లోనే ఈనాడు పంట పండింది. లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించింది.
ఈనాడు సొంతం చేసుకున్న హైదరాబాద్ ఫ్రాంఛైజీ లీగ్ స్థాయిలో ఏకంగా ఏడు విజయాలు సాధించింది. మరే జట్టూ సాధ్యం చేసుకోలేని విధంగా విజయాలు దక్కించుకుంది. క్వాలిఫయర్ 1లో ఖమ్మం జట్టు చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. అయితే హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఖమ్మం జట్టును ఓడించి హైదరాబాద్ జట్టు ట్రోఫీ సొంతం చేసుకుంది. హైదరాబాద్ జట్టుకు అభిరథ్ నాయకత్వం వహించాడు. జట్టును సమర్థవంతంగా నడిపించాడు. బంతితో, బ్యాటుతో అదరగొట్టాడు.
ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు టార్గెట్ 158 పరుగులు. ఈ లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అభిరథ్ రెడ్డి 48 పరుగులు చేశాడు. వైష్ణవ్ రెడ్డి 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. షణ్ముఖ అశ్విన్ 36 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు 17.3 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఖమ్మం జట్టులో మికిల్ జైస్వాల్ 65, హిమతేజ 31 పరుగులు చేశారు.
టార్గెట్ ఫినిష్ చేసేక్రమంలో హైదరాబాద్ ఛాంపియన్స్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. తిరుగులేని ఆట తీరుతో ఈ సీజన్ లో ఆకట్టుకున్న సాయి వికాస్ రెడ్డి 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈదశలో షణ్ముఖ తనకు లభించిన జీవనాధారాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. షణ్ముఖ, అభిరథ్ సూపర్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ జట్టుకు బలమైన పునాది వేశారు. కాగా, విజేత గా నిలిచిన హైదరాబాద్ జట్టుకు కోటి ఫ్రైజ్ మనీ లభించింది. ఖమ్మం జట్టుకు 50 లక్షలు దక్కాయి. ప్లేయర్ ఆప్ ది టోర్నీగా అభిరథ్ రెడ్డి, పర్పుల్ క్యాప్ విన్నర్ గా అజయ్ దేవ్ గౌడ్, ఇంఫాక్ట్ ప్లేయర్ గా గణేష్ గడుగు నిలిచారు.
