HomeతెలంగాణYashaswini Reddy : పాలకుర్తి కాంగ్రెస్ లో కుతకుత.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సొంత పార్టీలోనే...

Yashaswini Reddy : పాలకుర్తి కాంగ్రెస్ లో కుతకుత.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సొంత పార్టీలోనే వర్గ పోరు

Yashaswini Reddy : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం లో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి.. సీనియర్ రాజకీయ నాయకుడు.. ఓటమి అనేది ఎరుగని ప్రజాప్రతినిధి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద విజయం సాధించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దయాకర్ రావు మంత్రిగా కూడా పనిచేశారు. అపర చాణక్యుడిగా.. గండర గండడిగా దయాకర్ రావు పేరు గడించారు. అటువంటి దయాకర్ రావు మీద యశస్విని రెడ్డి విజయం […]

Yashaswini Reddy : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం లో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి.. సీనియర్ రాజకీయ నాయకుడు.. ఓటమి అనేది ఎరుగని ప్రజాప్రతినిధి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద విజయం సాధించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దయాకర్ రావు మంత్రిగా కూడా పనిచేశారు. అపర చాణక్యుడిగా.. గండర గండడిగా దయాకర్ రావు పేరు గడించారు. అటువంటి దయాకర్ రావు మీద యశస్విని రెడ్డి విజయం సాధించడం అంటే మాములు విషయం కాదు.

కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు అన్ని వర్గాలను కలుపుకొని పోయారు యశస్విని రెడ్డి. ఆమె తరఫున అత్త ఝాన్సీ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు సాగించారు. తద్వారా పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు. క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీ కంటే తక్కువ బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం విశేషం. అయితే సాధించిన విజయాన్ని సానుకూల విధానంలో తీసుకెళ్తే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని వ్యతిరేకవర్గం ఏకమైంది. ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థుల మీద వ్యతిరేకవర్గం సపోర్ట్ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. పాలకుర్తిలో మెజారిటీ గ్రామపంచాయతీలు మొత్తం వ్యతిరేకవర్గాలు.. గులాబీ పార్టీ సానుభూతిపరులు గెలుచుకోవడం విశేషం.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పంచాయతీలు వెళ్లాయి. అప్పటినుంచి మొదలైన పోరు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. పైగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి.. కాకినాడ హరి ప్రసాద్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల తోళ్లూరు మండలంలోని సోమవారం గ్రామంలో శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఒక వర్గం ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే ఫోటోలతో మరో వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కాకిరాల హరి ప్రసాద్ వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ లలో ఎమ్మెల్యే ఫోటో కనిపించలేదు. వేం నరేందర్ రెడ్డి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఆ ఫ్లెక్సీలలో కనిపించాయి. ఇక చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యశస్విని రెడ్డి.. ఝాన్సీ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్లో ఇలా వర్గ పోరు వల్ల కిందిస్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మందగించాయని.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపిస్తున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాల్వల్లోకి దండిగా నీళ్లు వచ్చేవని.. రైతులు మూడు పంటలు సాగు చేసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని దయాకర్ రావు అంటున్నారు. ఆయన పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు. నిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే స్థాయికి గులాబీ పార్టీని ఆయన తీసుకెళ్లారు. కాకపోతే చివరి నిమిషంలో గులాబీ పార్టీకి పరిస్థితి ఎదురు తిరిగింది. ఏది ఏమైనప్పటికీ 2023లో పాలకుర్తి నియోజకవర్గంలో కనిపించినంత జోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. అది ఆ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి తోడు గులాబీ పార్టీ ఇక్కడ క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వడానికి అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఫలితం వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper