Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం. మీడియాకు కూడా ఎక్కింది. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. వివాదం పరిష్కారం కావడం లేదు. ఏం చేయాలో పోలీసులకు అర్థం కావడం లేదు. చివరికి డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అందులో ఏం తేలుతుంది.. ఇంతకీ ఏమైంది.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి ఈ కథనం..
బీహార్ రాష్ట్రంలో ఒక గేదె కు సంబంధించిన వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్ల దాకా వచ్చింది. దీంతో పోలీసులకు శిరోభారంగా మారింది. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అదే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ గేదే యజమాని తెలుసుకునేందుకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని మగధ రేంజ్ ఐజి వికాస్ వైభవ్ నిర్ణయించారు. గయా జిల్లాలోని అతరీ పోలీస్ స్టేషన్ పరిధిలో సూరజ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన గేదె కనిపించకుండా పోయింది. దాని విలువ భారీగానే ఉంటుంది. ఎన్ని చోట్ల వెతికినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో సూరజ్ తీవ్రంగా ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో అతడు నవరంగా ప్రాంతంలోని ప్రకాష్ అనే వ్యక్తి ఇంటి వద్ద గేదెను కట్టేసి ఉంచారని తెలుసుకున్నాడు. దీంతో సూరజ్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు.
ప్రకాష్ ఇంటి వద్ద కట్టేసిన గేదే తనదే అని అతడు స్పష్టం చేశాడు. దానికి ప్రకాష్ ఒప్పుకోలేదు. ఆ గేదె తనదే అని ప్రకాష్ చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. పెద్దమనుషులు రంగ ప్రవేశం చేశారు. పంచాయతీని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు. ఎంతసేపటికి ఇద్దరు నాది అంటే నాది అంటూ వాగ్వాదానికి దిగడంతో ఆ సమస్య పరిష్కారం కాకుండా అలానే ఉండిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ మొదలు పెట్టారు. ఇద్దరూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అధికారులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ వ్యవహారం ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. నీతో మగధ రేంజ్ ఐజి అధికారి వికాస్ వైభవ్ గేదెకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అది పూర్తయ్యే వరకు గేదె పోలీసుల ఆధీనంలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. గేదె తల్లిదండ్రులను తెలుసుకోవడానికి డిఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని.. అప్పుడు ఆ గేదె ఎవరిదో తేలుతుందని ఐజి పేర్కొన్నారు. ఎందుకంటే ప్రకాష్ దగ్గర కొన్ని గేదెలు ఉన్నాయి. సూరజ్ వద్ద కూడా కొన్ని గేదెలు ఉన్నాయి. ఇద్దరి వద్ద ఉన్న గేదెల రక్త నమూనాలను సేకరించి.. డిఎన్ఏ ను పరిశీలించి.. వచ్చిన ఫలితాలు ఆధారంగా ఆ గేదె ఎవరిది అనేది తేల్చుతామని పోలీసులు చెబుతున్నారు.