Hyderabad Cricket Stadium: మనదేశంలో క్రికెట్ ఒక మతం అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. పైగా మన దేశంలో క్రికెటర్లను డేమి గాడ్స్ లాగా అభిమానులు భావిస్తూ ఉంటారు. వారు మైదానంలో కనిపిస్తే చాలు తమను తాము మర్చిపోయి ఎగిరి గంతులు వేస్తారు. ఐసీసీకి సింహభాగం ఆదాయం మనదేశం నుంచి వస్తోంది అంటే.. మన దేశ ప్రజలకు క్రికెట్ అంటే ఏ స్థాయిలో ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
క్రికెట్ పుట్టింది ఇంగ్లాండులో అయినప్పటికీ.. విస్తృతంగా అభివృద్ధి చెందింది మాత్రం మన దేశంలోనే. మనదేశంలో ఎన్నో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లాగా.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లాగా.. ప్రఖ్యాతి చెందిన స్టేడియాలు లేవు. అహ్మదాబాదులో నరేంద్ర మోడీ పేరుమీద స్టేడియం నిర్మించినప్పటికీ.. లార్డ్స్.. సిడ్నీ స్థాయిలో అందులో సౌకర్యాలు లేవు అనేది విశ్లేషకుల మాట. అయితే ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయబోతోంది హైదరాబాద్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కంకణం కట్టుకున్నారు. మొత్తంగా హైదరాబాదులో అత్యంత విశాలమైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి అడుగులు వేస్తున్నారు.
రేవంత్ రెడ్డి తన మానస పుత్రికగా చెబుతున్న ఫ్యూచర్ సిటీలో ఈ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియం నిర్మించబోతున్నారు. ఈ స్టేడియం కోసం తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించబోతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్మాణాన్ని.. నిర్వహణ నిధులను సమకూర్చనుంది. ఈ ఏడాది డిసెంబర్ 2026 లో ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో 1.32 లక్షలకు మించి ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ చూసే విధంగా సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 1.32 లక్షలు. పైగా ఈ స్టేడియాన్ని నరేంద్ర మోడీ పేరు మీద బిసిసిఐ నిర్మించింది. అహ్మదాబాద్ లో ఈ స్టేడియం నిర్మితమైంది. 2023 వన్డే ప్రపంచ కప్ తుది పోటీలో కంగారు జట్టు చేతిలో భారత్ ఓడిపోయింది. తద్వారా ట్రోఫీని దూరం చేసుకుంది.. ఈ ఓటమి తర్వాత ఈ మైదానం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. టీమిండియా ఆడిన ప్రతిసారి ఫైనల్ లేదా కీలకమైన పోటీలను ఈ మైదానంలో నిర్వహించడం పట్ల అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
ఇక ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించే ఈ క్రికెట్ స్టేడియానికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ప్రధాన కనెక్టివిటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఈ స్టేడియం ఉండడంతో అభిమానులు.. ప్రేక్షకులు సులువుగానే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. పైగా మెట్రోను కూడా ఇక్కడికి ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రకారం అభిమానులు నేరుగా ట్రైన్ లేదా వాహనాలు లేదా విమానం ద్వారా స్టేడియం దగ్గరికి చేరుకోవచ్చు. ఆ తర్వాత భారత జట్టు ఆడుతున్న మ్యాచ్ వీక్షించొచ్చు. మైదానంలో కూర్చొని సకల సౌకర్యాలను ఆస్వాదిస్తూ.. క్రికెట్ మ్యాచ్ ను ఆస్వాదించవచ్చు. కేవలం క్రికెట్ కోణంలోనే కాకుండా.. టూరిజం కోణంలో కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమీపంలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తోంది. ముచ్చర్ల సమీపంలోనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. దీనికి తోడు ఇక్కడ సమీపంలో ఆలయాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. ఆధునిక స్థాయిలో గోశాలను కూడా నిర్మిస్తోంది. మొత్తంగా చూస్తే నరేంద్ర మోడీ స్టేడియానికి చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి వేసిన అడుగులు బలంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. నేరుగా నరేంద్ర మోడీని ప్రశ్నించకుండానే పరోక్షంగా రేవంత్ రెడ్డి ఎత్తులు వేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.