Vemuri Radhakrishna: సరిగా కొద్దిరోజుల క్రితమే మాజీ ఎంపీ.. సీనియర్ పొలిటిషన్ విజయసాయిరెడ్డి విలేకరుల ముందుకు వచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో క్రైస్తవ మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యే టికెట్ల కోసం.. మంత్రి పదవుల కోసం మతాలు మారారని.. క్రైస్తవాన్ని తీసుకొని జగన్ ముందు బిల్డప్ ఇచ్చేవారని.. నాటి రోజుల్లో క్రైస్తవ మతాన్ని ఆచరించే వారికి.. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి బ్రహ్మాండంగా సాగిపోయేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
సరిగ్గా ఇప్పుడు ఇదే మాటను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఒకరకంగా పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా సంపాదకీయం రాశారు. ఇందులో కొత్త విషయం ఏదైనా ఉందంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం గురించి రాధాకృష్ణ బయటపెట్టిన నిజం. విజయ్ తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చి కేంద్రాలుగా పరిపాలన సాగుతుందట. చర్చిలలోనే కీలకమైన అధికారులకు శాఖలు కేటాయిస్తున్నారట. ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించిన వారికి మాత్రమే కీలక పదవులు దక్కుతున్నాయట. వాస్తవానికి ఈ విషయం నేషనల్ మీడియాలో ప్రసారమైనప్పటికీ అంతగా హైప్ రాలేదు.
ఇటువంటి విషయాలలో రాధాకృష్ణ ఓపెన్ గా మాట్లాడుతుంటారు. పైగా తన పత్రికలో ఇటువంటి అంశాలకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తుంటారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవ మతం ఏవిధంగా విస్తరించింది.. క్రైస్తవ మతాన్ని ఆచరించే వారికి ఆయా జిల్లాలో భారీగా భూములు ఎలా కేటాయించారు అనే విషయాలను లోతుగానే అధ్యయనం చేశారు రాధాకృష్ణ. తన పత్రికలో వరుస సిరీస్లలో కథనాలు ప్రచారం కూడా చేయించారు. వాస్తవానికి రాధాకృష్ణ కు ఈ స్థాయిలో క్రైస్తవ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేవారిపట్ల ఎందుకు ఈ స్థాయిలో ఆగ్రహం కలుగుతుందో ఇంతవరకు తెలియదు. గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన ఈ తరహా రాజకీయాలను తొలిసారిగా బయట పెట్టింది రాధాకృష్ణనే. అంతటి రామోజీరావు వల్ల కాలేదు. అపతో టీవీ9 రవి ప్రకాష్ వల్ల కూడా కాలేదు.
తెలంగాణలో కెసిఆర్ ఫామ్ హౌస్ భూములు.. ఇతర వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీలో కూడా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అయినప్పటికీ రాధాకృష్ణ కేవలం క్రైస్తవ మత రాజకీయాలకు మాత్రమే తన పత్రికలో ప్రధాన ప్రయారిటీ ఇచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోంది అని అర్థం. అన్నట్టు ఇటీవల విజయసాయిరెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాధాకృష్ణ.. ఇప్పుడు ఆయన మాట్లాడిన అంశాన్నే ప్రధానంగా పట్టుకోవడం.. దాని మీదనే సంపాదకీయం రాయడం అంటే మామూలు విషయం కాదు. ఈ రకంగా రాధాకృష్ణ విజయ సాయి రెడ్డికి తెరవెనుక సహకారం అందిస్తున్నారా.. అనే సందేహం ఈ సంపాదకీయం చదివిన తర్వాత రాక మానదు. ఇక మిగతా విషయాలు అంటారా.. ఇటువంటి అంశాలు రాధాకృష్ణకు కేక్ వాక్ లాంటివి.. అలవోకగా రాసుకుంటూ పోయారు.