Homeఆంధ్రప్రదేశ్‌పాత మిత్రుల కొత్త కలయిక: బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు

పాత మిత్రుల కొత్త కలయిక: బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు

రాజకీయం రంగులు మారుతోంది. పార్టీని, అధినేతను నమ్మిన వారు అందలం ఎక్కుతున్నారు.. ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ‘గంటా శ్రీనివాసరావు’ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సరిగ్గా అంచనావేసి ఆ పార్టీలో చేరి ‘మంత్రి’ పదవులు కొట్టేస్తుంటారు. ఆయనది లక్కీ హ్యాండ్ అని.. రాజకీయంగా సరిగ్గా అడుగులు వేస్తుంటారని కొనియాడుతుంటారు.  అదే సమయంలో ఏ పార్టీ ఓడిపోతుందో ఆ పార్టీలో చేరి తన రాజకీయ భవిష్యత్తును సమాధి చేసుకుంటారు బెజవాడ నేత వంగవీటి రాధా అనే పేరుంది. పోయిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీలో ఉన్న ఆయన రాజకీయ సమీకరణాలు అంచనా వేయలేక.. తన బద్దశత్రువైన టీడీపీలో చేరి నిండా మునిగారు. ఫలితం అనుభవిస్తున్నారు.

‘వంగవీటి రంగా’ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా అడుగులు ప్రతీసారి తడబడుతూనే ఉన్నాయి. వర్ధమాన రాజకీయాలను అర్థం చేసుకోలేక ఆయన వేసిన అడుగులు ప్రతీ సారి తప్పటడుగులుగా మారుతున్నాయి. ఏ పార్టీలో ఉంటే భవిష్యత్? ఏ పార్టీలో ఉంటే అందలం దక్కుతుందో సరిగ్గా అంచనావేయలేక పార్టీలు మారుతూ.. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతూ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు..

వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం ప్రతీసారి విశ్లేషకులను సైతం గందరగోళానికి గురిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారా? పార్టీ మారుతున్నారా? అనే చర్చ కూడా సాగుతున్న వేళ అందరికీ షాకిచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో రాధా గుడివాడ నుంచి టీడీపీ తరుఫున పోటీచేస్తారని ప్రచారం సాగింది. అందుకే ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడనే టాక్ నడిచింది. తెలుగు తమ్ముళ్లు కూడా ట్వీట్లు చేశారు. ఇదే క్రమంలో ఊహించని రాజకీయ పరిణామం తాజాగా చోటుచేసుకుంది.

వంగవీటి రాధా ఆదివారం రాత్రి ఏపీ వైసీపీ మంత్రి కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈక్రమంలోనే కొడాలి నాని, వంగవీటి రాధాలు ఆత్మీయంగా పలకరించుకోవడం విశేషం. ఓ గదిలో వారు చర్చించుకొని వేడుకలో కలిసి పాల్గొనడం ఆసక్తి రేపింది. రాజకీయ పార్టీలు వేరైనా ఇద్దరం మంచి మిత్రులం అని ప్రజలకు రాజకీయవర్గాలకు సంకేతం పంపారు. వీరిద్దరి కలయిక చూశాక టీడీపీలోకి వెళ్లిన వంగవీటి రాధా తిరిగి వైసీపీలోకి రానున్నారని చర్చ జరుగుతోంది.

2024లో టీడీపీ తరుఫున రాధా గుడివాడ నుంచి పోటీకి రెడీ అవుతున్నారని.. కాపు నేతలతో వరుస భేటిలు జరుపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఇంతలోనే వంగవీటి రాధా అందరికీ షాక్ ఇచ్చాడు. మంత్రి కొడాలి నానితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

వంగవీటి రాధా పొలిటికల్ వేసిన తప్పటడుగులే ఆయనను రాజకీయంగా సమాధి చేసిందని చెబుతుంటారు. 2019లో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి గుడ్ బై చెప్పి ఎన్నికల వేళ టీడీపీలో చేరారు. అదే వంగవీటి రాధా చేసిన పెద్ద తప్పు. వైసీపీలో ఉంటే మంత్రి పదవినో లేక మరేదో దక్కేది. నాడు తన కుటుంబానికి బద్దశత్రువైన టీడీపీలో చేరి ఆయన రంగా అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. అంతేకాదు టీడీపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి వైసీపీ ఘనవిజయం సాధించడంతో రాధా మళ్లీ రాజకీయాల్లో పెద్దగా బయటకు రాలేదు. కొద్దిరోజులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడంతో ఆ పార్టీలోకి వెళతారానే ప్రచారం జరిగింది. తర్వాత అమరావతి ఉద్యమం సమయంలో చంద్రబాబును విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటికెళ్లి రాధా కలిసి వచ్చారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా మళ్లీ టీడీపీలో యాక్టివ్ అవుతున్నారనుకుంటున్న సమయంలోనే వైసీపీ మంత్రిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి వంగవీటి రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular