YSR Congress: రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా చూస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి ఇబ్బందికర పరిస్థితుల్లో నెడుతోంది ఆ పార్టీని. ప్రస్తుతం ఆ పార్టీకి ప్లస్ జగన్మోహన్ రెడ్డి.. మైనస్ కూడా ఆయనే. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్ కోసం ఒక టీం రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై అంచనా వేసేందుకు ఈ టీం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో గ్రౌండ్ వర్క్ సిద్ధమైనట్లు.. కోస్తాంధ్రలో మాత్రం సర్వే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
* విజయ్ విజయంలో కపిల్ సాహు..
తమిళనాడులో విజయ్ పార్టీకి సేవలందించారు కపిల్ సాహు. ఏమాత్రం అంచనాలు లేని విజయ్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చేందుకు ఆయన వ్యూహాలు పని చేశాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి కపిల్ సాహును ఆశ్రయించినట్లు ప్రచారం సాగుతోంది. గత మూడు నెలలుగా ఆయన బృందం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో 32 నియోజకవర్గాల్లో సర్వే పూర్తయింది. ఇంకోవైపు రాయలసీమలో సైతం ఈ బృందం అన్ని పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాతో పాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సైతం జోరుగా సర్వేలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
* సరికొత్త నివేదిక..
అయితే ఈ బృందం సరికొత్తగా ఒక నివేదిక తయారు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన క్రియాశీలకంగా ఉండే నాయకులు, ఓటర్లను ప్రభావితం చేసే నేతలను కలిసి వైసిపికి పనిచేయాలని కోరినట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు వైసిపి అగ్రనేతలతో మాట్లాడించి వారిని అన్ని విధాల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో తటస్తులను, వివిధ రంగాల్లో ప్రముఖులను కలుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న సామాజిక సమీకరణలు, ఎలాంటి నాయకుడికి టిక్కెట్ ఇస్తే గెలు పొందుతారు? అనే అంశాలను సేకరణ పూర్తయినట్లు సమాచారం. మరోవైపు కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
* పాదయాత్ర సమయానికి..
వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పూర్తి బాధ్యులను నియమించాలని చూస్తున్నారు. ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇన్చార్జిలను సైతం మార్చడానికి కూడా వెనుకడుగు వేయరని తెలుస్తోంది. మొత్తానికైతే కపిల్ సాహు టీం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఏపీలో. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అస్పష్ట వైఖరి పై ఎక్కువగా ప్రజలు విముఖంగా ఉన్నట్లు ఈ సర్వే బృందం గుర్తిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నం చేస్తుండగా.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆ పార్టీ గ్రాఫ్ ను అమాంతం పడేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..