పునరావాస కేంద్రాల నుంచి అధికారుల అనుమతి లేకుండా స్వస్థలాలకు పయనమైన వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జి చేసిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలు 150 మంది తాడేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి శుక్రవారం కనిపించారు. దీంతో ఆమె వారితో మాట్లాడి సమస్య తెలుసుకుని పునరావాస కేంద్రానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళను స్వగ్రామాలకు తరలించేందుకు సూచనలు చేశారు. దీంతో కూలీలను విజయవాడ క్లబ్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
పునరావాస కేంద్రంలో శనివారం అల్పాహారం తిన్న అనంతరం కూలీలు మళ్ళీ కాలి నడకన, సైకిళ్లు మీద ప్రయాణానికి సిద్ధమై విజయవాడ క్లబ్ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడున్న పోలీసులు వారిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. వారు అంగీకరించక పోవడంతో లాఠీలకు పని చెప్పారు. దీంతో కూలీలు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.