గత కొద్దిరోజులుగా నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. నాగబాబు వ్యాఖ్యలను జనసేన పార్టీకి అంటగడుతూ ప్రత్యర్థులు మాటలయుద్ధానికి దిగుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో ప్రకటన విడుదల చేశారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మీడియా వేదికగా నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని అన్నారు. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీ నిర్ణయమేదైనా అధికారికంగానే ప్రకటిస్తామన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని నాగబాబుకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల నాగబాబు వరుసగా వివాదాస్పద అంశాల జోలికి వెళుతూ ట్వీట్లు పెడుతుండటంతో సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతోంది. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. గాంధీని చంపిన నాథురాం గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యారు. నాగబాబు వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, అభిమానుల్లో చర్చనీయాశంగా మారాయి. దీంతో నాగబాబు కేవలం నేను కేవలం గాడ్సే దేశ భక్తిని గురించి మాత్రమే మాట్లాడనని.. ఆయన చేసిన నేరం గురించి కాదంటూ వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. నాగబాబు వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
తాజాగా నాగబాబు మరోసారి ట్వీట్ చేశారు. ‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ్ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ.. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తురావడం లేదు.. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నాగబాబు వ్యాఖ్యలకు జనసేన పార్టీకి ‘సంబంధం లేదని పవన్ చెప్పడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే..!