AP Coalition Government: ఏపీలో కూటమి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని చూస్తోంది. కానీ ఎంత మాత్రం ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు అన్న లక్ష్యంతో పని చేస్తోంది కూటమి. ప్రధానంగా ఆ పార్టీకి ఆయువుపట్టుగా భావిస్తున్న రాయలసీమపై అదే పట్టుతో వచ్చే ఎన్నికల్లో కూడా ముందుకు సాగాలని చూస్తోంది కూటమి. ఇక్కడ రాజకీయంగా కంటే అభివృద్ధి పరంగా మార్కు చూపి ప్రజల మనసు గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన. మరోవైపు ఉత్తరాంధ్రలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని చూశారు. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. ఈ రెండు రీజియన్లపై చంద్రబాబు దృష్టి పెట్టగా.. ఉభయగోదావరి జిల్లాల్లో పట్టు పోకూడదు అని పవన్ పరితపిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో సైతం పట్టు సడల కూడదు అని భావిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. మొత్తానికి అయితే ఏపీపై గట్టిగానే ఉన్నారు కూటమి నేతలు.
* ఆది నుంచి పట్టు ఎక్కువ..
సాధారణంగా రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మిశ్రమ ఫలితాలు వస్తూ ఉండేవి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభావం అధికంగా ఉండేది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకి అక్కడ విపరీతమైన ఆదరణ దక్కింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది కానీ.. ఆ ప్రాంతంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సైతం గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో కూటమికి అండగా నిలిచాయి ఆ రెండు ప్రాంతాలు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు ప్రాంతాలను వదులుకోకూడదు అనేది కూటమి ఆలోచన.
* పారిశ్రామిక అభివృద్ధి..
రాయలసీమలో పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ప్రధానంగా తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ, అనంతపురం జిల్లాలో పారిశ్రామిక అడుగులు పడుతున్నాయి. కడప తో పాటు కర్నూలులో సైతం పెద్ద ఎత్తున తయారీ రంగ పరిశ్రమలు నిర్మిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పనిలో పడ్డారు. అయితే ఈ విషయంలో కూటమి పట్ల రాయలసీమ ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో సానుభూతి లేకుండా పోతోంది.
* ఉత్తరాంధ్రలో పెట్టుబడులు..
ఉత్తరాంధ్రలో సైతం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి వ్యక్తం అవుతుంది. ప్రత్యేక రైల్వే జోన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఆపై పోర్టులు, స్టీల్ ప్లాంట్ల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ పరిశ్రమల ఏర్పాటు, దిగ్గజ గూగుల్ డేటా సెంటర్, అనుబంధ సంస్థలు.. ఇలా అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతోంది కూటమి. అదే ప్రజల్లో సంతృప్తికి కారణం. ఆ రెండు ప్రాంతాల్లో వైసిపి ఆశలు వదులుకోవాల్సిందే అనే టాక్ సైతం వినిపిస్తోంది.