
టాలీవుడ్లోకి కొత్త నీరు ప్రవహిస్తున్న కొద్దీ.. కొత్త కాన్సెప్టులు పుట్టుకొస్తున్నాయి. ఆరు పాటలు.. నాలుగు ఫైట్ల థియరీకి ఏనాడో కాలం చెల్లిపోగా.. రొటీన్ కమర్షియల్ సినిమాల సంఖ్య కూడా తగ్గిపోతోంది. యువ దర్శకులు సరికొత్త ఐడియాలతో వెండితెరపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుండగా.. మరికొన్ని ఒప్పించలేకపోతున్నాయి.
అయినప్పటికీ.. కొత్త ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. మొన్నటికి మొన్న ఉప్పెన సినిమాలో కీలకమైన ‘కత్తిరింపు’ పాయింట్ గురించి డిస్కషన్ గట్టిగానే జరిగింది. అయితే.. మనసే ముఖ్యం అన్న పాయింటును జనాలు యాక్సెప్ట్ చేశారు. అది తప్ప, సినిమా మొత్తం సూపర్ అన్న ఆలోచన కూడా కారణం కావొచ్చు. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది.
నిన్న వచ్చిన ‘చావుకబురు చల్లగా’ అనే చిత్రంలోనూ ఇలాంటి గట్టిపాయింటే ఉంది. తల్లీ కొడుకు కలిసి మందు తాగడమే కాకుండా.. తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడం అనే ఆడ్ పాయింట్ ను కూడా ప్రముఖంగా చూపించాడు దర్శకుడు. అయితే.. తల్లికి ఇలాంటి క్యారెక్టరా? అనుకున్నారేమోగానీ.. ఆడియన్స్ ఈ ఆడ్ పాయింట్ ను అంగీకరించలేదు.
కాగా.. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’లోనూ ఇలాంటి పాయింట్ ఉందట. ఇది ఇంకా గట్టిదని అంటున్నారు. చాలా కాలంగా నలుగుతున్న అంశాన్ని ఎత్తుకున్నాడట శేఖర్. మరి, ఆ పాయింట్ ఏంటీ..? దాన్ని ప్రేక్షకులు ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారు? అన్నది చూడాలి. నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 16న విడుదల కాబోతోంది.