Vijaya Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధినేత జగన్మోహన్ రెడ్డి మనసు ఎరిగి పనిచేస్తారు. ఆయన మనసులో ఉన్న దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కానీ ఏ ఒక్కరూ దానిపై స్పందించడం లేదు. వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాజ్యసభ పదవిని వదులుకొని మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. వైసిపి హయాంలో మద్యం కుంభకోణం జరిగింది అని బయటపెట్టింది కూడా ఆయనే. అటువంటి నిందలు వేసిన వ్యక్తి తిరిగి పార్టీలోకి వస్తాం అంటే కచ్చితంగా వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తాయి. కానీ ఇప్పుడు వారికి ఏవో ఆదేశాలు ఉన్నట్టు అర్థమవుతోంది. వైసీపీలోకి రీ ఎంట్రీ ఉంటుందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
* ఆ కాస్తా మినహాయింపు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా.. పార్టీ నుంచి ఉన్నఫలంగా బయటకు వెళ్ళిపోయినా.. అటువంటి వారిని వెంటాడి వేటాడినంత పని చేస్తారు. కానీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. దానికి కారణం ఆయన తమ మనిషి అని… ఎప్పటికైనా తిరిగి రాక తప్పదు అని భావించినట్టు ఉన్నారు. అందుకే విజయసాయిరెడ్డి ఎలాంటి ప్రకటనలు చేసిన వైసీపీ కీలక నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగింది అని.. తనకు సంబంధం లేదని చెబుతూనే.. భారీ కుంభకోణం జరిగింది అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాతనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అరెస్టుల పర్వం కొనసాగింది. అటువంటి వ్యక్తి మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారు అంటే కచ్చితంగా పార్టీ శ్రేణులు వ్యతిరేకించాలి. కానీ వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
* మౌనమే అంగీకారం..
కచ్చితంగా విజయసాయిరెడ్డి వైసీపీ గూటికి చేరడం ఖాయమని తేలిపోతుంది. ఎందుకంటే వైసీపీ శ్రేణుల మౌనమే అంగీకారం. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆ పార్టీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు సమయంలో జగన్ వెంట విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆ పార్టీని జాతీయస్థాయిలో బాగా తీసుకెళ్లడంలో కూడా ఆయన పాత్ర ఉంది. 67 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలవడం లో కూడా ఆయన పాత్ర ఉంది. విజయసాయిరెడ్డి వ్యూహాలతోనే జాతీయస్థాయి రాజకీయాల్లో వైసిపి ఇమిడిపోయింది. బిజెపితో తెరవెనుక స్నేహానికి.. ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వెళ్లి పోవడానికి ముమ్మాటికీ విజయసాయి రెడ్డి కారణం. అటువంటి విజయసాయిరెడ్డిని అవసరం కోసం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటారు. అధినేత మనసు ఎరిగిన నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విజయసాయిరెడ్డి విషయంలో మౌనంగా ఉంటుంది అందులో భాగమే. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.