Naga Chaitanya: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా నితిన్ , నాగ చైతన్య పేర్లు ఉంటాయి. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే సినిమాలు తీస్తూ వచ్చారు ఈ ఇద్దరు. అయితే వీరిద్దరిలో ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ చిత్రం తో ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి భారీ కం బ్యాక్ ఇవ్వగా, నితిన్ మాత్రం కరోనా లాక్ డౌన్ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ , తన కెరీర్ ని తీవ్రమైన సంక్షోభం లోకి నెట్టేసుకున్నారు. తదుపరి చిత్రం తో అయినా భారీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు నితిన్. అయితే నితిన్ , నాగ చైతన్య కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ చిత్రం రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గత ఏడాది కిరణ్ అబ్బవరం తో ‘k ర్యాంప్’ వంటి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ జైన్స్ నాని రీసెంట్ గానే నితిన్ ని కలిసి ఈ మల్టీస్టార్రర్ కి సంబంధించిన స్టోరీ ని వినిపించారట. ఆయనకు బాగా నచ్చిందని , ఈ మల్టీస్టార్రర్ లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారట. ఇక కేవలం నాగ చైతన్య కి మాత్రమే స్టోరీ ని వినిపించాల్సి ఉంది. ఆయన కూడా ఒప్పుకుంటే ఈ క్రేజీ మల్టీస్టార్రర్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. తొలిసినిమాతోనే భారీ హిట్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన జైన్స్ నాని, తన తదుపరి చిత్రం కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. మంచి హిట్ తగిలింది కదా, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ ఆయన గురించి సోషల్ మీడియా లో చర్చగా కూడా జరిగింది.
కానీ ఆయన ఈ భారీ మల్టీస్టార్రర్ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారని రీసెంట్ గానే తెలిసింది. ప్రస్తుతం నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ తో కలిసి ‘వృష కర్మ’ అనే మిస్టిక్ జానర్ మూవీ ని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు. మరోపక్క నితిన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ థీమ్ తో సినిమా చేస్తున్నారు . ఈ చిత్రానికి నారి & సోమా శేఖర్ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు ఈ రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ క్రేజీ మల్టీస్టార్రర్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చే అవకాశం ఉంది.