Homeఅత్యంత ప్రజాదరణవైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

Corruption in AP medical health sector

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేస్తే పేదవారి వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. ప్రభుత్వం ఎన్ని కోట్లు కుమ్మరించినా.. ఎంత సంక్షేమం అమలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొందరు అధికారుల భాగోతాలు ” అవినీతి రహిత పాలన ” అంటున్న ముఖ్యమంత్రికి ఇప్పుడు తలవంపులు తెస్తున్నాయన్న చర్చ అధికార పార్టీలో సాగుతోంది. కోట్ల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ” కరోనా” విపత్కర సమయంలోనూ వైద్యఆరోగ్యశాఖలోని ఒక ఉన్నతాధికారికి కోట్లు కురుస్తున్నాయట.. అవినీతితో పంకిలమైన అధికారికి ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ కల్పతరువుగా మారిందట..

Also Read: జగన్ తనదైన రీతిలో మర్యాద చేస్తున్నాడట!

వైద్య ఆరోగ్య శాఖలో తిష్టవేసిన సదురు ఉన్నతాధికారి అందులో జరిగిన నియామకాలు , ట్రాన్స్ ఫర్లు , ప్రమోషన్లలన్నింటిని ఒక్కోదానికి ఒక్కో రేటు పెడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారని ఆ శాఖలోని ఉద్యోగులు వాపోతున్నారట.. ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి , అక్రమాలు పరాకాష్టకు చేరాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చిర్రెత్తుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా విజిలెన్స్ విచారణకి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓ డీఎంఈ ఉన్నతాధికారి చేతివాటం, వ్యవహారశైలిపై అధికారులు విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయట..

సదురు డీఎంఈ అవినీతి వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది బాధిత వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని విజిలెన్స్ విచారణ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల భారీ ఎత్తున జరిగిన నియామకాలలో.. ట్రాన్స్ ఫర్లలో.. ప్రమోషన్లలో, సదురు డీఎంఈ కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు ఉన్నా కౌన్సెలింగ్ లో చూపక పోవడం.. వాటిని తరువాత డబ్బిచ్చిన వారికి కట్టబెట్టినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. అర్హత లేని వారికి ప్రోమోషన్లు ఇవ్వడం.. అర్హతలున్న వారికి మొండిచెయ్యి చూపడం.. బయో కెమిస్ట్రీ లాంటి డిపార్ట్మెంట్ లలో అర్హులైన వైద్యులను పక్కన బెట్టి , ఎంఎస్సీ లాంటి డిగ్రీ చేసిన వారిని 10 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం.

అవినీతి అక్రమాల కేసుల్లోనూ కొందరు వైద్య అధికారులను కాపాడినట్లు విచారణలో వెలుగుచూసిందట.. లంచాలు తీసుకొని ఆ కేసులను మాఫీ చేశాడట.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఒక ఫ్రొఫెసర్ (ఈయన టీడీపీ మాజీ మంత్రికి సమీప బంధువు ) కొద్ది సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదు. దీన్ని కర్నూల్ కాలేజి అధికారుల నివేదికలు ధృవీకరించాయి. అయినా కూడా సదురు డీఎంఈ ఆయనకు మొత్తం జీతాన్ని మంజూరు చేసినట్టు వెలుగుచూసింది. ఇంత బరితెగింపుగా ఈ డీఎంఈ అవినీతికి పాల్పడడం పరాకాష్టకు నిదర్శనమని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే విజిలెన్స్ ఎదుట గోడువెళ్లబోసుకున్నారట..

Also Read: విరాళమివ్వం.. జేఏసీ ప్రకటనపై ఉద్యోగుల ఫైర్

మరో వైపు ఈ డీఎంఈ వ్యవహారశైలిపై ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రికి విషయం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. డబ్బిస్తే తప్ప మంత్రి చెప్పినా పనులు కాకపోవడం చూసి ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. డీఎంఈ అవినీతి , అక్రమాలు , తలబిరుసుతనం, నిర్లక్ష్య వైఖరితోనే ఏపీ ప్రభుత్వం వరకు విషయం వెళ్లి సదురు డీఎంఈ అవినీతిని పెకిలించేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి అవినీతి జలగలను ఏరిపారేసేందుకు నిర్ణయించారు. చరిత్రలో ఎవ్వరూ చేయనన్ని వైద్య నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రికి ఈ అవకతవకలు అక్రమాల వల్ల అభాసుపాలు కావడం ఆగ్రహం తెప్పించిందని సమాచారం.. అందుకే విచారణాధికారులకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణాధికారులు కూడా రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నిర్భయంగా వచ్చి సదురు డీఎంఈపై ఫిర్యాదు చేయాలని , వివరాలు గోప్యంగా ఉంచుతామని పిలుపినిచ్చారు. దీంతో సదురు డీఎంఈ డొంక కదులుతోంది. ఇప్పుడీ విచారణ విషయం రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోవడంతో మరెందరో బాధితులు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణతోనైనా ఆ అవినీతి అధికారికి తగిన శాస్తి జరుగుతుందా లేదా అన్నది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular