Project 75(I) : ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత శక్తి ప్రపంచానికి తెలిసింది. భారత ఆయుధాలను చూసి అగ్ర రాజ్యాలే ఆశ్చర్యపోయాయి. ఈ క్రమంలో మన శత్రువులు ఎవరు అనేది కూడా తేలిపోయింది. దీంతో భారత ప్రభుత్వం త్రివిధ దళాల బలోపేతంపై దృష్టి పెట్టింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో స్వదేశీ ఆయుధాల తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే సమయంలో వివిధ దేశాలతో చేసుకున్న ఆయుధ కొనుగోలు ఒప్పందాలను కూడా వేగవంతం చేస్తోంది. భారత్–జర్మనీ మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ 75(ఐ) ఇప్పుడు ఆమోదం వైపు కదులుతోంది. సుమారు రూ.70 వేల కోట్ల విలువైన ఈ కార్యక్రమం ద్వారా ఆరు ఆధునిక డీజిల్–ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు భారత్లోనే నిర్మించనుంది. ఇది నావికాదళ సామర్థ్యాలు, స్వదేశీ పరిశ్రమ, ఇండో–పసిఫిక్ వ్యూహాత్మక సమతుల్యతపై లోతైన ప్రభావం చూపనునుంది.
ప్రాజెక్ట్ 75(ఐ) ప్రాముఖ్యత..
భారత నావికాదళం ప్రస్తుతం వయసు పెరిగిన సబ్మెరైన్ నౌకాదళాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. కల్వరి తరగతి(స్కార్పీన్) సబ్మెరైన్లు ఉన్నప్పటికీ, మరిన్ని ఆధునిక, ఎక్కువ కాలం నీటి అడుగున ఉండగల వాహనాలు అవసరం. ప్రాజెక్ట్ 75(ఐ) ఈ ఖాళీని భర్తీ చేయడానికి రూపొందించబడింది. జర్మనీకి చెందిన థైసెన్క్రూప్ మెరైన్ సిస్టమ్స్ (టీకేఎంఎస్)తో భాగస్వామ్యంలో మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ (ఎండీఎల్) వద్ద నిర్మాణం జరగనుంది. ఇది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో జరుగుతున్న ముఖ్యమైన ప్రయత్నం.
ఆధునిక సాంకేతిక సామర్థ్యాలు..
ఈ సబ్మెరైన్లలో ఆధునిక సెన్సార్లు, టార్పెడోలు, క్షిపణులు, వార్ సిస్టమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) సాంకేతికతతో అవి సంంప్రదాయ డీజిల్–ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల కంటే చాలా ఎక్కువ కాలం నీటి అడుగున ఉండగలవు. ఇది స్టెల్త్ సామర్థ్యాన్ని పెంచి, శత్రు గుర్తింపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా తీరరక్షణ, సముద్ర మార్గాల నిఘా, వ్యతిరేక సబ్మెరైన్ యుద్ధం, దూరప్రాంత ఆపరేషన్లలో భారత్ మరింత బలపడుతుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీ నేపథ్యంలో ఇది ముఖ్యమైనది.
మేక్ ఇన్ ఇండియా..
ఈ ప్రాజెక్ట్ అతి పెద్ద విలువ స్వదేశీ నిర్మాణంలో ఉంది. సబ్మెరైన్లు భారత్లోనే తయారు కావడం వల్ల స్థానిక పరిశ్రమ, ఉపాధి, సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సాంకేతిక బదలాయింపు ద్వారా భవిష్యత్తులో మరిన్ని సబ్మెరైన్లు స్వయంగా రూపొందించుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీనితోపాటు టార్పెడోలు వంటి వ్యవస్థల్లో కూడా భారతీయ భాగస్వామ్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వైపు మరో అడుగు.
భౌగోళిక ప్రభావాలు
ఈ డీల్ రష్యా ఆధారిత సరఫరా గొలుసులపై ఆధారపడటాన్ని తగ్గించి, భాగస్వామ్యాలను వైవిధ్యపరుస్తుంది. జర్మనీతో రక్షణ సహకారం లోతుగా మారుతుంది. భారత తీరం మరింత బలోపేతం కావడంతోపాటు, ప్రాంతీయ శక్తి సమతుల్యతలో భారత్ స్థానం మెరుగవుతుంది. అయితే, నిర్మాణం ప్రారంభమైన తర్వాత మొదటి సబ్మెరైన్ అందుబాటులోకి రావడానికి అనేక సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు రెండింటినీ సమతుల్యం చేసుకోవాలి.
సాంకేతిక అంచనాలు, వ్యయ నిర్ణయాలు, ఆమోద ప్రక్రియలు గతంలో ఆలస్యాలకు కారణమయ్యాయి. ఇప్పుడు చివరి దశలో ఉన్నప్పటికీ, కాంట్రాక్ట్ సంతకం, ఉత్పత్తి షెడ్యూల్, స్థానిక కంటెంట్ లక్ష్యాలను సాధించడం కీలకం. వ్యయం ఎక్కువగా ఉన్నా, దీర్ఘకాలిక ఆపరేషనల్ ప్రయోజనాలు, పారిశ్రామిక వృద్ధి దృష్ట్యా ఇది వ్యూహాత్మక పెట్టుబడిగా చూడవచ్చు.