Vishal Garg : మారుతున్న మార్కెట్ పరిస్థితులు.. ఉద్యోగులపై ఆరోపణలు వంటి కారణాలతో ఓ కంపెనీకి చెందిన సీఈవో ఏకంగా 900 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించాడు. కేవలం మూడు నిమిషాల జూమ్ కాల్ తో వీరిని తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ ఉద్యోగులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా క్రిస్మస్ పర్వదినానికి ముందు ఉద్యోగం కోల్పోయాం అన్న బాధ చాలామందిలో ఆవేదనను కలిగించింది. అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించిన ఆ సీఈవో ప్రస్తుతం రోడ్డుపై పడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. అయితే ఇప్పుడు ఆయన న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటం ఫలిస్తుందా? లేదా? అనేది తెలియదు. కానీ 900 మందిని ఒకేసారి తొలగించడంతో ఈ సీఈఓ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాను చేసిన పాపమే తనకు చుట్టుకుంది.. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఆ సీఈవో భారత సంతతి వ్యక్తి.. ఆసక్తికర ఈ కథలోకి వెళ్తే..
2021.. కరోనా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయం. అప్పట్లో చాలామంది వర్క్ ఫ్రొం హోమ్ చేసేవారు. దీంతో సమావేశాలు అన్నీ జూమ్ లోనే కొనసాగేవి. ఆ ఏడాది డిసెంబర్ లో బెటర్ డాట్ కామ్ లో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో విశాల్ గార్గ్ సంచలన ప్రకటన చేశాడు. మూడు నిమిషాల మీటింగ్ ఉందని చెప్పి అందరిని సమావేశపరిచి.. ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికన్ డిజిటల్ మార్ట్గేజ్ కంపెనీ అయినా బెటర్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో విశాల్ గార్గ్. ఈయన భారతదేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ న్యూయార్క్ లోని పెరిగి 2014లో బెటర్ డాట్ కామ్ కంపెనీని స్థాపించారు. అయితే ఈయన ఉద్యోగులపై రకరకాల ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు రెండు గంటలు మాత్రమే పనిచేస్తున్నారని.. కంపెనీని మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మారుతున్న మార్కెట్ పరిస్థితులకు కంపెనీ తట్టుకోలేకపోతుందని. కంపెనీ నష్టాల్లో ఉందని పేర్కొన్నారు.
అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం మూడు నిమిషాల సమావేశంలో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది జీవితాల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కార్పొరేట్ వ్యవస్థలోనే ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదని కొందరు తీవ్రంగా చర్చించుకున్నారు.
ఈ నిర్ణయం తర్వాత తన సీఈవో పదవికి ఎసరు వస్తుందని ముందే భావించి.. తిరిగి సీఈవోగా నియామకం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు కాలంతోపాటు పరిస్థితులు అతని పదవి నుంచి తొలగించేందుకు ప్రతికూలంగా ఏర్పడ్డాయి. 2026 ఆగస్టు 3న విశాల్ గార్గ్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్ నియామకమయ్యారు. అయితే విశాల్ గార్గ్ కొత్త సీఈఓపై పలు ఆరోపణలు చేశారు. ఆయన డైరెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించుకొని తనను సీఈఓ పదవి నుంచి తప్పించాలని అన్నారు. ఆయన ఖర్చు తగ్గింపుపై చేసిన ఆలోచనలు బాగున్నాయని.. కానీ ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు నచ్చలేదని ఆరోపణలు చేసినట్లు సిఎన్ఎన్ ఛానల్ తెలిపింది.