Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి భద్రాద్రి రాముడు అంటే చాలా ఇష్టం. అందువల్లే ఆయన శ్రీరామనవమి సందర్భంగా సతి సమేతంగా భద్రాచలం వస్తుంటారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తన భార్యతో కలిసివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.. కళ్యాణ ఉత్సవంలో పాల్గొంటారు. భద్రాద్రి రాముడి ఆలయ అభివృద్ధిని కేసీఆర్ పక్కన పెడితే.. కేవలం యాదగిరి క్షేత్రం సేవలోనే తరించిపోతే.. రేవంత్ రెడ్డి మాత్రం భద్రాద్రి రాముడిని అక్కున చేర్చుకున్నారు. ఆయన ఆలయ అభివృద్ధికి సిద్ధమయ్యారు.. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో రామాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు.
భద్రాద్రి రాముడి మీద ఉన్న ఇష్టాన్ని రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారు.. రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో వేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని జగన్నాధపురం ప్రాంతంలో బహిరంగ సభలో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు కేసీఆర్ కుటుంబానికి బహిరంగంగా సవాల్ విసిరారు. 2029 మే నుంచి జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182 కు పెరిగిపోతాయి. వీటిల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుంది.. భద్రాద్రి రాముడు మీద ఆన. ఇది ఖమ్మం ప్రజల మాట.. కెసిఆర్ కాచుకో.. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ ఎవరు వస్తారో రండి అంటూ” రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం కౌరవ వంశం గా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
వాస్తవానికి రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దగా నమ్మదు . గతంలో రామసేతు వ్యవహారం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయోధ్య రామాలయం నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాలుపంచుకోలేదు. ఆలయ ప్రారంభోత్సవానికి రాలేదు. రాముడు గురించి ఎన్నడు కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా మాట్లాడలేదు. ఇప్పుడు అయోధ్య వివాదం తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ గొంతు సవరించుకుంటున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి రాముడికి అనుకూలంగా మాట్లాడారు.. ఏకంగా రాముడు మీద ఆనవేశారు. ఎంతైనా పూర్వపు రోజుల్లో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పని చేశారు.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అందువల్లే ఆయన ఇప్పుడు రాముడు గురించి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారని.. ఏకంగా భద్రాద్రి రాముడి మీద 2029 ఎన్నికల ఫలితాలను వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
