Chocolate : నేటి కాలంలో చాలామంది పిల్లలు చాక్లెట్లకు బాగా అలవాటుపడుతున్నారు. అయితే కొన్ని చాక్లెట్లలో కెమికల్స్ కలపడం వల్ల ఇవి తింటే వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. అయితే ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి ఆహారాలకే అలవాటు పడే పిల్లలతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అయితే ఓ తండ్రి తన కుమార్తెకు చాక్లెట్ తినడం వల్ల జరిగే నష్టాన్ని చెప్పేందుకు ఎంచుకున్న వినూత్న పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడో చూడండి..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్నారి మంచంపై పడుకుని ఉంటుంది. ఆమె తండ్రి కంప్యూటర్కు కనెక్ట్ చేసిన మౌస్ను అల్ట్రాసౌండ్ స్కానర్లా ఉపయోగించాడు. ఆ మౌస్ను చిన్నారి కడుపుపై నెమ్మదిగా కదిలిస్తూ, కంప్యూటర్ స్క్రీన్పై ముందుగానే సిద్ధం చేసిన ఫేక్ అల్ట్రాసౌండ్ వీడియోను చూపించాడు. ఆ వీడియోలో కడుపులో పెద్ద పురుగు కదులుతున్నట్లు కనిపించడం చిన్నారిని ఒక్కసారిగా భయపెట్టింది.
అనంతరం తండ్రి తన కూతురితో ఇలా అన్నాడు. ‘ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు, జంక్ ఫుడ్ తింటే ఇలాంటి పెద్ద పురుగులు కడుపులో పెరుగుతాయి. అందుకే ఇవి తినకూడదు’ అని వివరించాడు. అది నిజమేనని నమ్మిన ఆ చిన్నారి ఇకపై స్వీట్లు, జంక్ ఫుడ్ తిననని, ఆరోగ్యకరమైన ఆహారమే తింటానని మాటిచ్చింది. ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పేందుకు తండ్రి తెలివిగా వ్యవహరించాడు అంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం పిల్లలను భయపెట్టి కాదు.. ప్రేమగా, నిజమైన సమాచారంతో అవగాహన కల్పించాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ తండ్రి చేసిన పనికి ఆ చిన్నారి జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాక్లెట్లు లేదా జంక్ ఫుడ్ తింటే నేరుగా కడుపులో పురుగులు పుడతాయనేది నిజం కాదు. అయితే అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం, దంతాల సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు, పోషకాహార లోపం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు భయపెట్టే కథల కంటే, వాటి వల్ల కలిగే నిజమైన ఆరోగ్య నష్టాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.