Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు ఇన్నాళ్లపాటు కాపలా ఉన్న అనకొండల బాగోతం బయటికి వచ్చింది. దీంతో ఆపరేషన్ మొదలైంది.
ఇదంతా కూడా ఏదో డిస్కవరీ ఛానల్ గురించో .. యానిమల్ ప్లానెట్ గురించి చెప్పడం లేదు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల కథ గురించి.. అవినీతి అధికారుల భాగవతం గురించి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దూకుడుగా పని చేస్తుంది. విపరీతంగా దాడులు చేస్తోంది. అవినీతి అధికారులను పట్టుకుంటున్నది. వారి దగ్గర నుంచి వందల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నది. అయితే ఇప్పటిదాకా రెవెన్యూ.. నీటిపారుదల శాఖ.. అటవీశాఖ.. ఎలక్ట్రిసిటీ.. మున్సిపల్ శాఖ.. పోలీస్ శాఖ వంటి వాటి మీదనే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. పట్టుకుని అధికారులు మొత్తం గ్రూప్ వన్.. గ్రూప్ 2.. కేడర్ కి సంబంధించిన వారు. అయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఐపీఎస్.. ఐఏఎస్ అధికారుల అవినీతి మీద దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఇటీవల పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పి సంగిరెడ్డి భీమిరెడ్డిని తెలంగాణ ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా 2019 నాటి కేసును తవ్వి తీసిన పోలీసులు.. అతని అవినీతి చుట్టాలు మొత్తం బయటపెట్టారు. దాదాపు అతడు 150 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించాడు. ఎలక్ట్రిసిటీ లో పనిచేసిన ఏడి స్థాయి అధికారి 150 కోట్లకు పైగా ఆస్తులతో దొరికిపోయాడు. అయితే వీరంతా కూడా బినామీలు మాత్రమేనని తెలుస్తోంది. అసలు సూత్రధారులు.. పాత్రధారులు వేరే ఉన్నారని సమాచారం.
కొంతకాలంగా ఐఏఎస్ అధికారుల తీరు.. ఐపీఎస్ అధికారుల తీరు వివాదాస్పదంగా ఉంటున్నది. వారంతా కూడా భారీగా ఆస్తులు సంపాదించారు. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. అక్రమంగా ఆస్తులు సంపాదించిన అధికారుల మీద దృష్టి సారించారు. వారిని త్వరలోనే పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసి.. వారి అవినీతి వ్యవహారాన్ని బయట పెట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణ ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడే ఐపిఎస్.. ఐఏఎస్ అధికారులు ఎవరో చూడాలి మరి..






