Sugali Preethi Case : ఏపీలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారంలోకి రాగానే.. తన కుమార్తె సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని.. ఆ హామీ అమలుకు నోచుకోలేదని.. ఆయన తమను మోసం చేశారని సుగాలి పార్వతి ఆరోపించారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆఫిర్యాదుల పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం లో జనసేన అధినేతపై ఫిర్యాదు చేశారు.
“అప్పట్లో జన సేన అధినేత ఈ కేసు గురించి పదే పదే చెప్పేవారు. నా కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ నా కుమార్తె కేసు విషయంలో ఇంతవరకు న్యాయం జరగలేదు. అధికారులకు వచ్చిన తర్వాత తాము చేపట్టే మొదటి కేసు సుగాలి ప్రీతిదని పవన్ కళ్యాణ్ హామీ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.. ఇంతవరకు నా కుమార్తె కేసులో ఎటువంటి పురోగతి లేదు.. గడచిన ఐదు రోజులుగా వందల మంది పోలీసులు.. నాకు జిల్లాల ఎస్పీలు ఉరుకుల పరుగులు పెడుతున్నారు. యూట్యూబర్ జోసెఫ్ ను అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమేర శ్రద్ధ నా కుమార్తె కేసు మీద పెట్టి ఉంటే న్యాయం జరిగి ఉండేదని” పార్వతీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
“నా కుమార్తె వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లల్లో ఉంటున్నారు. కర్నూలులో అత్యంత దర్జాగా తిరుగుతున్నారు. నా కళ్ళ ముందు అనంత కనిపిస్తోంది. నాకు మాత్రమే ఎందుకు ఈ వివక్ష.. నా కుమార్తె కేసులో ఆధారాలు మొత్తం తారుమారు అయ్యాయని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అసలు ఆయనకు ఆ ఆధారాలు ఎక్కడివి.. ఆధారాలు లేకుండా ఆయన ఎలా మాట్లాడారు.. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాలి.. డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఒక దివ్యాంగురాలైన నాకు మాట ఇచ్చి మర్చిపోయారు. ఇది మోసం కాదా.. ఈ కేసులో ప్రముఖ పాత్ర పోషించిన వారికి పవన్ కళ్యాణ్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఇది ముమ్మాటికి దుర్మార్గం. నేను దివ్యాంగురాలిని. జనసేన నాయకులు.. వీర మహిళలు నన్ను బాడీ షేమింగ్ చేశారని” పార్వతి ఆరోపించారు.
పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. వారు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి.. ఫిర్యాదు చేసిన వ్యవహారంపై సాక్షి మీడియా.. వైసీపీ నాయకులు కీలకంగా దృష్టి సారించారు. ఆ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్వతి అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు ప్రీతి కేసు కు సంబంధించి మాట్లాడినప్పుడు నాడు జగన్ గానీ.. వైసీపీ మీడియా గానీ పట్టించుకోలేదు. ఇప్పుడు జనసేనానికి వ్యతిరేకంగా ఉండడంతో సాక్షి మీడియా ప్రముఖంగా పార్వతి కి ప్రాధాన్యం ఇస్తోంది.. దీనిని బట్టి సుగాలి ప్రీతి కేసు మరోసారి ఏపీలో సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.
