KTR : రాజకీయ నాయకులు చేసింది గోరంత అయితే.. చెప్పుకునేది కొండంత. పదేళ్ల భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో కూడా అదే జరిగింది. మీడియాలో డబ్బాలు కొట్టుకునేవారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు మయంగా మార్చామని చెప్పుకునేవారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బాగుచేసామని.. ప్రతిష్టాత్మకమైన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయని అనేవారు.
ఇప్పుడు అధికారం పోయింది. దీంతో గులాబీ పార్టీ నేతలకు వాస్తవం అర్థమైంది. అందువల్లేవారు ఇటీవల కాలంలో వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తమ పరిపాలన కాలంలో గొప్ప సంస్కరణలు జరగలేదని.. ప్రధానంగా విద్యా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోలేదని ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని కూడా నేరుగా ఆయనే చెప్పారు.
భారత దేశంలో తన కూతురు చదివే గొప్ప విద్యా సంస్థ లేదట. పైగా తన కూతురు గొప్ప విద్యా సంస్థలు ఇండియాలో ఏమున్నాయి అని అడిగితే కేటీఆర్ చెప్పలేకపోయారట. అందువల్లే ఆమెను అమెరికాలో చదివిస్తున్నారట. చివరికి శ్రీలంకతో పోల్చి చూస్తే భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు లేవట. ఒకవేళ కేటీఆర్ చెప్పింది నిజమే అనుకుంటే.. దేశంలో ఉన్న ఐఐటీలు.. ఐఐఎంలు.. ఇతర ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు వృధా నేనా.. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా పనికిరానివేనా… ఇదే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది అని చెప్పేవారు. తెలంగాణలో ఉన్న విద్యాసంస్థలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పేవారు. అధికారం పైన తర్వాత ఒక్కసారిగా ఆ విద్యా సంస్థలు నాసిరకంగా మారిపోయాయా.. తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్ప విద్యా సంస్థలు లేనప్పుడు.. తన కొడుకును Oakridge స్కూల్లో ఎందుకు చదివించారు.. విదేశీయులు కూడా మన దేశానికి వస్తున్నారు కదా.. మనదేశంలో ఉన్న ఉన్నతమైన విద్యా సంస్థల్లో చదువుతున్నారు కదా.. మనదేశంలో చదివిన వారు ప్రఖ్యాతమైన సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు కదా.. ఇది కేటీఆర్ కు కనిపించలేదా.. శ్రీలంకతో ఇండియాను ఎలా పోల్చుతారు.. ఏమైనా సోయి ఉందా..
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవారు. చివరికి బంగ్లా జీడిపితో భారతదేశాన్ని పోల్చి చూసి విమర్శించేవారు. అందువల్ల జనం ఓడించారు. వ్యవసాయ క్షేత్రానికి పరిమితం చేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అలానే మాట్లాడుతున్నారు. చివరికి తన కూతురు చదివే స్థాయి విశ్వవిద్యాలయం ఇండియాలో లేదని చెప్పేశారు. విదేశాలలో ఉన్న విశ్వవిద్యాలయాలలో చదవాలి అంటే భారీగా డబ్బు ఉండాలి. ఆ డబ్బు తనకుందని కేటీఆర్ చెబుతున్నారా.. తన కూతురు ఇక్కడ చదవడం ఏంటి నాన్సెన్స్ అని పరోక్షంగా చెబుతున్నారా.. ఇండియా గురించి మాట్లాడిన కేటీఆర్.. ఇండియాలో తెలంగాణ ఒక భాగమని గుర్తించలేకపోయారా.. లేక తెలంగాణ ఏమైనా ప్రత్యేక దేశమని అనుకుంటున్నారా.. ఈ మధ్య కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నారు అసలు సమజ్ కావడం లేదు. అన్నట్టు కేటీఆర్ ఏం మాట్లాడినా సరే ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు గట్టిగా ప్రచారం చేస్తాయి. కానీ తన కూతురు చదివే విశ్వవిద్యాలయం గురించి కేటీఆర్ మాట్లాడితే ఆ పార్టీ సోషల్ మీడియా గ్రూపులు పెద్దగా ప్రచారం చేయలేదు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.