Asaduddin Owaisi : ఎం ఐ ఎం చీఫ్… అసదుద్దీన్ ఓవైసీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో చిచ్చు రాజేశాడు. సోషల్ మీడియా వేదికగా సౌత్, వెస్ట్ హైదరాబాద్ నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు మార్చడం అన్యాయమని, ఇది సాధారణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతోందని వ్యాఖ్యానించారు. గుడిమాల్కాపూర్ మార్కెట్ తరలింపును ఆధారంగా చేసుకుని, నగరంలోని వివిధ జోన్ల మధ్య వివక్ష ఉందనే పెద్ద అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాతనగరం సౌత్ పరిధిలోకి, మెహదీపట్నం-కార్వాన్ పరిసరాలు వెస్ట్ పరిధిలోకి వస్తాయి. ఈ నిర్ణయాలు ప్రాంతాల మధ్య అసమానతను పెంచుతున్నాయని, స్థానికుల భావోద్వేగాలను రెచ్చగొట్టాడు.
తరలింపునకు కారణాలు..
ఇటీవలి సంవత్సరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శాంతిభద్రతను మెరుగుపరచడం, శివారు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కార్యాలయాలు, విభాగాలను రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొత్త భవనాలకు, తూర్పు-ఉత్తర శివార్లకు మార్చింది. ఇందులో కలెక్టరేట్ సంబంధిత విభాగాలు, వక్ఫ్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయాలు, పోలీస్ నిర్వహణ కార్యాలయాలు, మార్కెటింగ్ శాఖ నోడల్ కార్యాలయాలు ఉన్నాయి. పాతనగరంలోని ఇరుకైన రోడ్లు, అధిక జనసాంద్రత వల్ల రోజూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు, మెరుగైన కనెక్టివిటీ, ఆధునిక సౌకర్యాలు ఉండటం వల్ల పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. శివార్ల అభివృద్ధి ద్వారా నగరం మొత్తం సమతుల్యంగా వృద్ధి చెందాలనేది లక్ష్యం.
ఓవైసీ ఆందోళన ఎందుకు?
ఓవైసీ ఇలా జోన్ల వారీగా అసంతృప్తిని బయటపెడుతున్నారనేది బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. పాతనగరం ఎంఐఎంకు ఎప్పటి నుంచో బలమైన ఆధారం. అయితే వెస్ట్ జోన్లో ఐటీ కారిడార్ విస్తరణ వల్ల మెహదీపట్నం, కార్వాన్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో జనాభా మార్పులు పార్టీకి కొత్త సవాళ్లను తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కుటుంబాలు నివసించడం వల్ల స్థానిక సంప్రదాయ ఓటర్ల నిష్పత్తి మారుతోంది. ఈ ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యాపార కేంద్రాలు శివార్లకు తరలిపోతే, స్థానిక మైనారిటీల ఆర్థిక వనరులు దెబ్బతినడమే కాక, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు ప్రభావితమవుతారు. గుడిమాల్కాపూర్ వంటి సాంప్రదాయ మార్కెట్లు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవి. అందుకే ప్రభుత్వం సౌత్, వెస్ట్ హైదరాబాద్ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందనే భావోద్వేగ అంశాన్ని ఉపయోగిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓవైసీ వ్యూహం..
సాధారణ పరిపాలనా మార్పులను కూడా ప్రాంతీయ వివక్షగా చిత్రీకరించడం ద్వారా, పాతనగరంలోని కొత్త ఓటర్లను, వెస్ట్ హైదరాబాద్లోని వ్యాపార వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకం చేయాలనేది ఓవైసీ ప్రధాన ప్రణాళిక. నగర అభివృద్ధి అంతా హైటెక్ సిటీ లేదా ఉత్తర హైదరాబాద్ వైపు మాత్రమే జరుగుతోందని, సౌత్-వెస్ట్ ప్రాంతాలను పాలకులు వదిలేస్తున్నారని బలంగా ప్రచారం చేసి, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును రక్షించుకోవడానికి ఈ భౌగోళిక వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా స్థానిక సంఘాల్లో ఐక్యతను పెంపొందించి, ప్రత్యర్థి పార్టీల ప్రభావాన్ని తగ్గించాలనేది ఓవైసీ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ వివాదం మరింత రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. స్థానిక సంఘాల నుంచి నిరసనలు, ప్రజా ఉద్యమాలు రావచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వం మరోవైపు నగరం మొత్తం అభివృద్ధిని నొక్కి చెప్పి, తరలింపు నిర్ణయాలను సమర్థించవచ్చు. ఓవైసీ ఈ అంశాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే, ఎన్నికల సమయంలో ఓటర్ల మధ్య చర్చలు ఎక్కువవుతాయి. ఈ చర్చ నగర అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ వ్యూహాల మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.
