Homeజాతీయ వార్తలుతమిళనాట పళని స్వామి ఎందుకు అంత బలంగా మారారు?

తమిళనాట పళని స్వామి ఎందుకు అంత బలంగా మారారు?

Palaniswami
తమిళనాడులో పళనిస్వామి బలహీనమైన నేత కాదు. మూడున్నరేళ్లు ఎలాంటి చరిష్మా లేకుండానే పార్టీని, ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు నడపగలిగారు. తొలినాళ్లలో పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తం అయినా.. వాటిని సర్దుబాటు చేసుకుంటూ.. పళని స్వామి పూర్తికాలంగా ప్రభుత్వాన్ని నడపగలిగారు. ఇక పాలనలో తనదైన మార్క్ కూడా చూపించారు. జయలలిత, కరుణానిధి పాలన చూసిన తరువాత పళని స్వామి పాలన ప్రశాంతంగా సాగిందన్నది తమిళుల్లో ఎక్కువమంది అభిప్రాయం.

Also Read: బీజేపీని టైం చూసి దెబ్బకొడుతున్న వైసీపీ, టీడీపీ

అయితే రేపు జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే.. పళనిస్వామి ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ సీట్ల సర్దుబాటు. సీట్ల సర్దుబాటు విషయంలో పళని స్వామి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూటమి నుంచి వైదొలుగుతానన్నా పెద్దగా లెక్క చేయలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని కూటముల్లో సీట్ల సర్దుబాటు జరిగిన తరువాత డీఎండీకే కూటమి నుంచి వైదొలిగింది.

విజయ్ కాంత్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే.. అది తమకు ఉపకరిస్తుందని పళనిస్వామి నమ్ముతున్నారు. ఇక బీజేపీ విషయంలోనూ పళనిస్వామి రాజీ పడలేదు. బీజేపీ గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గలేదు. కేంద్రంలో బలంగా ఉన్నా.. మోదీ, అమిత్ షాలు అనేకసార్లు తమిళనాడులో పర్యటించినా.. ఆ పార్టీకి ఇరవైకి మించి సీట్లు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే పళనిస్వామి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్నారనే చెప్పాలి. పన్నీర్ సెల్వం వర్గాన్ని కూడా టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు.

Also Read: మోదీషాలకు వారే దిక్కవుతున్నారా..?

పళనిస్వామి తొలినుంచి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ పట్టుబట్టినా పళనిస్వామి లెక్క చేయలేదు. దగ్గరుండి మరీ అన్నాడీఎంకే సమావేశంలో సీఎం అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. తనకు ప్రత్యర్థిగా ప్రచారంలో ఉన్న పన్నీర్ సెల్వం చేతనే పళనిస్వామి ఆ ప్రకటన చేయించారు. శశికళను పార్టీలో చేర్చుకొమ్మని బీజేపీ నుంచి ఒత్తిడి వచ్చినా.. కుదరదు పొమ్మన్నాడు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల్లో రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయం పక్కన పెడితే.. పళనిస్వామి మాత్రం బలంగానే ఉన్నారని చెప్పుకోవాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular