Homeఆంధ్రప్రదేశ్‌Andhra politics : ఆంధ్రా రాజకీయాల్లో ఎవరు ఎటువైపు? ఎవరికి నష్టం? లాభం?

Andhra politics : ఆంధ్రా రాజకీయాల్లో ఎవరు ఎటువైపు? ఎవరికి నష్టం? లాభం?

Andhra politics : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకతను గుర్తించిన జగన్.. అభ్యర్థుల మార్పు ద్వారా అధిగమించాలని భావిస్తున్నారు. తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో పాటు బిజెపిని కలుపుకెళ్లాలని భావిస్తోంది. తద్వారా 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది. అటు జనసేన పొత్తుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని.. 2029 నాటికి ఒంటరిగా అధికారంలోకి రావడానికి స్కెచ్ వేస్తోంది.

అయితే ప్రాంతీయ పార్టీలు ఈ లెక్కన ఉంటే.. జాతీయ పార్టీలు మరోలా ఆలోచిస్తున్నాయి. తమకు లాభనష్టాలు, సీట్లు, ఓట్ల లెక్కలు వేస్తున్నాయి. ఒంటరిగా బలపడాలని చూస్తున్నాయి. బిజెపి అయితే 2029 నాటికి ఏపీపై తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలని తొలుతా భావించింది. కానీ జనసేన అందుకు అంగీకరించడం లేదు. అందుకే కూటమిలోకి రావాల్సిన అనివార్య పరిస్థితి బిజెపిది. అందుకే వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాలను అడగాలని ఒక నిర్ణయానికి వచ్చింది.

అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఏపీలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను పార్టీలో చేర్చుకుంది . ఏపీ పగ్గాలను అప్పగించనుంది. వైసీపీలో అసంతృప్తులను పార్టీలో చేర్చుకొని ఒక ఊపు తేవాలని భావిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో గెలుపుతో ఊపు మీద ఉన్న పార్టీ.. అదే స్ఫూర్తిని ఏపీలో ప్రదర్శించాలని చూస్తోంది. అయితే బిజెపితో పోల్చుకుంటే కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోంది. వామపక్షాలతో కలిసి పోటీ చేయడం ద్వారా ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాల గెలుపోటములను నిర్దేశించే స్థాయికి కాంగ్రెస్ చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే బిజెపి గానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. ముస్లిం మైనారిటీ ఓట్లు గుంప గుత్తిగా తనకు పడతాయని జగన్ భావిస్తున్నారు. బిజెపి వారితో కలవాలని కోరుకుంటున్నారు. ఒకవేళ తాను గెలుపొందితే ప్రధాని మోదీతో సాన్నిహిత్యం కొనసాగించాలని చూస్తున్నారు. అయితే టిడిపి ఆలోచన మరోలా ఉంది. బిజెపిని కలుపుకొని వెళ్తే కేంద్ర ఎన్నికల సంఘం సాయంతో పాటు భారీగా ఆర్థిక సాయం, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు ధైర్యంతో ముందుకు వస్తాయని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అటు జనసేన సైతం ఇదే అభిప్రాయంతో ఉంది. మూడు పార్టీలు కలిస్తే 2014 కు మించి.. మంచి మెజారిటీతో అధికారంలోకి రావచ్చు అన్న అంచనా వేస్తోంది. మొత్తానికైతే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ముందుకు సాగుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular