Rammohan Naidu: శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు గెలిచారు. తండ్రి ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. ఎంట్రీ వరకు ఒకే కానీ.. రాజకీయాల్లోకి వచ్చి పదవి చేపట్టాక తన పట్టు పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు పార్టీతో పాటు వ్యక్తిగత చరిష్మ పెరగడంతో ఆయనను ఢీకొట్టే నాయకుడు ఇప్పుడు లేకుండా పోతున్నాడు. ప్రధానంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మంచి విజయాలు దక్కించుకుంది కానీ.. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ విషయానికి వచ్చేసరికి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. దీని విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డికి. సరైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్న ఆయన నేతలను ఎంపిక చేస్తుంటే.. తమ వల్ల కాదంటూ వారు తేల్చి చెబుతున్నారు. పోటీ చేసేది లేదు అంటూ పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
* వైసీపీకి లోటే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంది. కానీ శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు సీట్లు మాత్రం ఆ పార్టీకి దక్కలేదు. ఆ మూడు సీట్లపై పూర్తిగా గురి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం గట్టిగానే దృష్టిపెట్టారు. వాస్తవానికి ఇక్కడ చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్. తొలి ఎన్నికల్లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతిని ప్రయోగించారు. కానీ ఫలితం లేకపోయింది. 2019లో దువ్వాడ శ్రీనివాసులు ప్రయోగించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీంచింది కానీ.. ఇక్కడ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ నెగ్గలేకపోయారు. మరోవైపు 2024 ఎన్నికల్లో కాలింగ్ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ ను ప్రయోగించారు జగన్. కనీసం రామ్మోహన్ నాయుడు ముందు ఆయన నిలవలేకపోయారు.
* ఈసారి వెలమ లేక మత్స్యకారులకు..
అయితే జిల్లాలో, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో వెలమ, కాలింగ, తూర్పు కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆపై మత్స్యకారులు కూడా అధికం. అయితే ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలను ప్రయోగించాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మాన ఫ్యామిలీ నుంచి ఒకరిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు వెలమసామాజిక వర్గం కాబట్టి. ఆ సామాజిక వర్గంలో చీలిక తెస్తే ప్రయోజనం ఉంటుంది అనేది ఒక అంచనా. ఆపై మత్స్యకార సామాజిక వర్గాన్ని సైతం ప్రోత్సహించే అవకాశం ఉంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ప్రయోగిస్తారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.